ఇంటర్ పూర్తయిన స్టూడెంట్లకు ఉన్నత చదువులపై అవగాహన : టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి 

ఇంటర్ పూర్తయిన స్టూడెంట్లకు ఉన్నత చదువులపై అవగాహన : టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి 
  • రేపు ఉన్నతవిద్యామండలి ఆధ్వర్యంలో స్పెషల్​ ప్రోగ్రామ్​: టీసాట్​ సీఈవో వేణుగోపాల్​ రెడ్డి 

హైదరాబాద్​, వెలుగు: ఇంటర్మీడియట్ పూర్తయి అండర్​ గ్రాడ్యుయేట్​లోని వివిధ కోర్సుల్లోకి వెళ్లే విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ), తెలంగాణ స్కిల్స్​, అకడమిక్స్​అండ్ ట్రైనింగ్ (టీసాట్) ఆధ్వర్యంలో సోమవారం స్పెషల్ లైవ్​ప్రోగ్రామ్​ను నిర్వహించనున్నట్టు టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​ రెడ్డి తెలిపారు.

ఇంజనీరింగ్​, డిగ్రీ తదితర కోర్సుల ఎంపికలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీసాట్​ నిపుణ చానెల్​లో రెండు గంటల పాటు ప్రసారమవుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్​ఫ్రొఫెసర్​డాక్టర్  వి. బాలకిష్టా రెడ్డి హాజరై సలహాలు, సూచనలు ఇస్తారని వివరించారు. ఆయనతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా మాట్లాడి అనుమానాలు తీర్చుకోవచ్చని వెల్లడించారు. ఇటు ఉన్నతవిద్యామండలి వైస్​చైర్మన్లు ప్రొఫెసర్​ పురుషోత్తం, ప్రొఫెసర్​ఎస్కే మహమూద్​, కార్యదర్శి ప్రొఫెసర్​ శ్రీరాం వెంకటేశ్​లు సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు ఈ లైవ్​ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.