హైదరాబాద్, వెలుగు: మరణించిన పెన్షనర్లకు సంబంధించిన డీఏ బకాయిలు, ఇతర పెండింగ్ నిధులను వారి కుటుంబ సభ్యులకు తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ (టీఎస్ జీఆర్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్ రెడ్డి, ఎంసీ లింగన్న ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ జనరల్ పార్వతీదేవి, జేడీ నాగరాజు తదితరులను టీఎస్ జీఆర్ఈఏ ప్రతినిధులు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.
సర్వీస్ పెన్షనర్లు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన డీఏ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని నేతలు వివరించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయా కుటుంబాలకు బకాయిలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. దీనిపై ట్రెజరీ డీజీ పార్వతీదేవి సానుకూలంగా స్పందిస్తూ.. బకాయిల విడుదల కోసం తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్రెజరీ డీజీని కలిసిన వారిలో టీఎస్ జీఆర్ఈఏ నేతలు లక్ష్మీనరసింహారావు, నరసింహాచారి తదితరులు ఉన్నారు.
