27న గ్రూప్ 2 నోటిఫికేషన్

27న గ్రూప్ 2 నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​ 2 నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 27న నోటిఫికేషన్  ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని కమిషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి ఈనెల 16న గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉన్నా, వివిధ టెక్నికల్ కారణాలతో వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ముందుగా గ్రూప్​2 ద్వారా 663 పోస్టులను భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించినా, ఆ తర్వాత పలు వెల్ఫేర్ డిపార్ట్​మెంట్లలోని పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గ్రూప్ 2 నోటిఫికేషన్​ను 783 పోస్టులతో ఇచ్చే అవకాశముంది. వివిధ కారణాలతో వాయిదా పడ్డ గ్రూప్ 2 నోటిఫికేషన్ ను 27న ఇస్తామని టీఎస్​పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నోటిఫికేషన్ ప్రక్రియకు అంతా రెడీ అయిందని ఆయన వెల్లడించారు. ఈనెల 30లోపు గ్రూప్ 1 పికప్​ లిస్టు కూడా విడుదల చేస్తామని చెప్పారు. అదే రోజు మెయిన్స్ తేదీలను వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

185 వెటర్నరీ అసిసెంట్‌ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కసరత్తు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మరో రెండు జాబ్​ నోటిఫికేషన్లు గురువారం రిలీజ్ చేసింది. వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్​మెంట్​లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, బీ కేటగిరిలో 185 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. దీనికి ఈనెల 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 సాయంత్రం 5 గంటల దాకా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. హార్టికల్చర్ డిపార్ట్​మెంట్​లో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు మరో నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 3 నుంచి 24 సాయంత్రం 5 గంటల దాకా అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ చూడాలని తెలిపింది.