- ఒక్క రోజులోనే 17.84 కోట్ల ఆదాయం
- సంస్థ చరిత్రలో ఇవే అత్యధిక వసూళ్లు
- కిలోమీటర్కు రూ.40– 50కి పెరిగిన రాబడి
హైదరాబాద్, వెలుగు: వరుసగా చార్జీల పెంపుతో ఆర్టీసీకి దండిగా ఆమ్దానీ వస్తున్నది. సంస్థ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆదాయం సమకూరుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సుమారు రూ.18 కోట్ల టికెట్ కలెక్షన్ వచ్చింది. వారం రోజులతో పోలిస్తే దాదాపు రూ.5 కోట్లు అదనంగా వచ్చింది. గతంలో ఒక రోజు ఆదాయం అత్యధికంగా రూ.16 కోట్లు కాగా.. ఇప్పుడు ఆ రికార్డును సవరించింది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో 78.17 శాతంగా రికార్డయ్యింది. ఎర్నింగ్ పర్ కిలోమీటర్, ఎర్నింగ్ పర్ బస్ భారీగా పెరిగింది. ఈ నెల మొదటి వారంలో చార్జీలు పెంచకముందు ఎర్నింగ్ పర్ బస్ రూ.13 వేల దాకా ఉండగా, ఇప్పుడు అది రూ.18,500కి పెరిగింది. ఇక ఎర్నింగ్ పర్ కిలోమీటర్ రూ.38 నుంచి రూ.51కి ఎగబాకింది.
హైదరాబాద్ రీజియన్లో అత్యధికం
రాష్ట్రంలో 97 ఆర్టీసీ డిపోలున్నాయి. 8 వేల బస్సుల్లో రోజూ 32 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. నెల రోజుల కింద వరకు రోజువారీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. పెండ్లిళ్లు, ఫంక్షన్లు, సమ్మర్ టూర్స్ ఉన్నప్పటికీ రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల మధ్య కలెక్షన్ వచ్చేది. సోమవారం రూ. 17.84 కోట్లు వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్ రీజియన్లో రూ.2.85 కోట్ల ఇన్కం సమకూరింది. ఈ నెల 9వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రాగా.. అదే రోజు నుంచి రూ.15 కోట్లపైనే కలెక్షన్ వస్తున్నది. 3 నెలల్లో 6 సార్లు సెస్ల పేరుతో చార్జీలు పెంచింది. మొదట పల్లెవెలుగు బస్సుల్లో రౌండ్ ఫిగర్తో ప్రారంభించి.. సేఫ్టీ సెస్, ప్యాసింజర్ సెస్, 2 సార్లు డీజిల్ సెస్, టోల్ సెస్ విధించారు. దీంతో 30 శాతం నుంచి 50 శాతం వరకు చార్జీలు పెరిగాయి. నెలకు రూ.80 నుంచి రూ.90 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.
ఏపీలోనూ పెంచాలని కోరిన ఆఫీసర్లు
ఇటీవల టీఎస్ఆర్టీసీ భారీగా చార్జీలు పెంచడంతో ఏపీఎస్ ఆర్టీసీకి కలిసొస్తోంది. తెలంగాణ కంటే ఏపీ బస్సుల్లో తక్కువగా చార్జీ ఉండటంతో ప్రయాణికులంతా ఏపీ బస్సుల్లోనే జర్నీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాలుగైదు రోజులుగా ఏపీఎస్ ఆర్టీసీకి మస్తు కలెక్షన్ సమకూరుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా బస్ చార్జీలు పెంచాలని టీఎస్ఆర్టీసీ కోరినట్లు తెలిసింది. రెండు సంస్థల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం రెండు రాష్ట్రాల్లో తిరిగే అంతరాష్ర్ట సర్వీసుల్లో ఒకే విధమైన చార్జీలు ఉండాలి. అందుకే ఒకే టికెట్లు ఉండేలా ఏపీఎస్ ఆర్టీసీని కోరినట్లు సమాచారం.