ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌పై 10 శాతం రాయితీ!

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌పై 10 శాతం రాయితీ!

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టికెట్‌ పై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఈ ఆఫర్ ఆగస్టు 15వ తేదీ వరకు అందుబాటులో ఉండనుందని తెలిపింది. 

విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. రానూపోనూ ఒకే సారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుంది. ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్రయాణికుడికి ఆదా అవుతుంది.

అయితే ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్‌ కోరారు. ముందస్తు రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.com ను సంప్రదించాలని సూచించారు.