టీఎస్ఆర్టీసీ జనరల్ రూట్ పాస్.. 8 కి.మీ పరిధిలో రాకపోకలకు వర్తింపు

టీఎస్ఆర్టీసీ జనరల్ రూట్ పాస్.. 8 కి.మీ పరిధిలో రాకపోకలకు వర్తింపు
  • హైదరాబాద్ లో ‘రూట్ పాస్’
  • తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్న‌ టీఎస్‌ఆర్టీసీ
  • 8 కిలోమీటర్ల పరిధిలో వర్తింపు
  • ఆర్డినరీ రూట్ పాస్ కు రూ.600.. మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ కు రూ.1000
  • ఈ నెల 27 నుంచి రూట్ పాస్ అమల్లోకి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 

ఎన్ని రోజులు..ఎంత మనీ..

జనరల్ రూట్ పాస్ తీసుకునే వారు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్  ధర రూ.600. మెట్రో ఎక్స్ప్రెస్ రూట్ పాస్ ధర రూ.1000 గా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్  ప్రయాణికులకు అందించబోతుంది. ఈ రూట్ పాస్ కొనుగోలు చేసిన ప్రయాణికులు  8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించవచ్చు. సెలువు దినాలు, ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణం చేయవచ్చు.

ఆ ప్రయాణికుల కోసమే..

హైదరాబాద్ లో ప్రయాణికులకు జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్ కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ కలిగిన ప్రయాణికులు  సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో  తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే  జనరల్ రూట్ పాస్ ను టీఎస్ఆర్టీసీ తీసుకువస్తోంది. 

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్ను సంస్థ ప్రారంభించింది. రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్పాస్లను ఇస్తుండగా... తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు  ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. సాధారణంగా ఆర్డీనరీ రూట్ పాస్ కు రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1200 గా ఉంటుంది. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందించబోతుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం జనరల్ మెట్రో పాస్ లు 1.30 లక్షలు, ఆర్డీనరీ పాస్ లు 40 వేల వరకు ఉన్నాయి.