సెప్టెంబర్ 5న ఆర్టీసీ రాఖీ పండగ లక్కీ డ్రా.. అదృష్టవంతులెవరో..

సెప్టెంబర్ 5న ఆర్టీసీ రాఖీ పండగ లక్కీ డ్రా.. అదృష్టవంతులెవరో..

రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను టీఎస్ఆర్టీసీ  రేపు (సెప్టెంబర్ 05) నిర్వహించనుంది. రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రాను నిర్వహించి.. ప్రతి రీజియన్ కు ముగ్గురి చొప్పున మొత్తం 33 మంది విజేతలను ఎంపికచేయనుంది. ఈ లక్కీ డ్రాకు జిల్లా స్థాయి మహిళా అధికారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగిందని టీఎస్ఆర్టీసీ తెలిపింది.

రాఖీ పండగ సందర్భంగా సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించి.. గెలుపొందిన వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం రీజియన్ కు రూ.50 వేల చొప్పన 11 రీజియన్లకు రూ.5.50 లక్షలను కేటాయించింది. ఒక్కో రీజియన్ లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.

ALSO READ: చైనా అధ్యక్షుడు వస్తే ఇంకా బాగుంటుంది.. : జీ 20 సమ్మిట్ పై జో బైడెన్

రాఖీ పండగ సందర్భంగా ఆగస్టు 30, 31 తేదీల్లో సంస్థ ప్రకటించిన లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని ఆర్టీసీ తెలిపింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్ ను రాసి వేశారు మహిళలు.

రేపు(సెప్టెంబర్ 05) నిర్వహించే ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో సెప్టెంబర్ 8న  బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది. విజేతలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించి వారిని ఘనంగా సంస్థ సత్కరించనుంది టీఎస్ఆర్టీసీ.