టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించం: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించం: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించబోమని అన్నారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. శనివారం ( సెప్టెంబర్ 20 ) తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల పవిత్రత, ప్రశాంతత కాపాడటం మనందరి బాధ్యత అని.. ముఖ్యంగా భక్తులకు సరైన సమాచారం అందించే విషయంలో మీడియా పాత్ర మరింత కీలకమైనదని అన్నారు వెంకయ్య చౌదరి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మీడియా ప్రతినిధుల నుండి ప్రయోజనకరమైన సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని అన్నారు.ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేగంగా పెరుగుతోందని.. కానీ చాలామంది యూట్యూబర్లు భక్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా, అవాస్తవ, ఆధారరహిత వార్తలతో గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు.

తప్పుడు వార్తల వల్ల  ప్రపంచవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉందని అన్నారు.తిరుమల కొండల పవిత్రతను కాపాడటం, టీటీడీ కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో మీడియాపై ఎంతో బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు అన్నారు. తిరుమలలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న  మీడియా ప్రతినిధులకు తిరుమలలో జరుగుతున్న అభివృద్ధిపై, భక్తులకు టీటీడీ అందిస్తున్న విశేష సేవలపై ఎంతో అవగాహన ఉంటుందని అన్నారు.

టీటీడీపై అసత్య కథనాలతో దుష్ప్రచారం చేసే వారిని నియంత్రించేందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని, వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని కోరారు వెంకయ్య చౌదరి. ఈ సమావేశంలో డీఎఫ్వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, సీపిఆర్వో డాక్టర్ టి. రవి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.