
టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలపై స్పందించింది టీటీడీ. టీటీడీపై భూమన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలు అని కొట్టిపడేసింది టీటీడీ.నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లడం శోచనీయమని పేర్కొంది. శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని... వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవమని తెలిపింది టీటీడీ.
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా... ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా తెలిపింది టీటీడీ.శ్రీవారి ఆలయంలో గానీ, బయట గానీ, కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశామని పేర్కొంది. వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
అర్చకుల తనిఖీలు అవాస్తవం:
అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవని... వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది టీటీడీ. అయితే.. ఇటీవల ఆలయం లోపల అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని పేర్కొంది. ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు తెలిపింది. ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు కూడా అందుతున్నాయని వెల్లడించింది టీటీడీ.
పీఠాధిపతులకు నోటీసులు:
పీఠాధిపతులకు నోటీసులు అంటూ భూమన చేసిన ఆరోపణ అవాస్తవమని పేర్కొంది టీటీడీ. గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలకు నోటీసులు జారీ చేశామని స్పష్టం చేసింది..
ఏఐ టెక్నాలజీ
ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి భక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేశామని.. శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నామని తెలిపింది. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నామని స్పష్టం చేసింది టీటీడీ.
భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నామని.. IVRS, WHATSAPP, శ్రీవారి సేవకులు ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాల్లో 90 శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు, తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారని వెల్లడించింది. ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపింది.
పరకామణిలో తనిఖీ
2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా వచ్చిన అపవాదును తొలగించడానికి సంవత్సర కాలంగా... పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది టీటీడీ. ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పున:స్థాపించేలా పరకామణిలో SoP తయారు చేశామని స్పష్టం చేసింది.ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ SoP లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుందని... ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ల ఏడాది కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగలేదని స్పష్టం చేసింది టీటీడీ.
వాస్తవాలు ఇలా ఉంటే... మాజీ చైర్మన్ టీటీడీపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని... వ్యవస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని కోరింది టీటీడీ.