వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో ఇవాళ(ఫిబ్రవరి 20) ఆయన వేసవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గత రెండు, మూడు సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషించి, దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తర్వాత రోజు దర్శనాలకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సంఖ్య వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్, అవసరమైన చోట్ల షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేసి మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈవో తెలిపారు.
ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచి, గంటల వారీగా ఇన్–అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. వివిధ కేటగిరీల దర్శనాలను డేటా ఆధారంగా హేతుబద్ధంగా కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు వేగంగా దర్శనం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.వేసవిలో భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని అదనపు ఈవో ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
