టీటీడీ సంచలన నిర్ణయాలు: తిరుమలలానే తిరుపతిలోనూ నో లిక్కర్!

టీటీడీ సంచలన నిర్ణయాలు: తిరుమలలానే తిరుపతిలోనూ నో లిక్కర్!

తిరుపతిలోనూ పూర్తి స్థాయి మద్య నిషేధం కోరుతూ ప్రభుత్వానికి లేఖ

కళ్యాణ కట్ట ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం

సంక్రాంతి నుంచి కొండపై పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశంలో పలు సంచనల నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం ఉదయం పాలకమండలి సమావేశం జరిగింది. గరుడ వారధి నిర్మాణం, స్విమ్స్ ను టీటీడీ పరిధిలోకి తీసుకోవడం సహా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, ఉద్యోగులకు, భక్తులకు ధన్యవాదాలు చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

కీలక నిర్ణయాలివే:

  • తిరుమలకు మంచినీటి కోసం బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది.
  • తిరుమల తరహాలో తిరుపతిలోనూ పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం విధించాలని ప్రభుత్వానికి లేఖ పంపాలని బోర్డు నిర్ణయించింది.
  • తిరుపతిలోని స్విమ్స్ (శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిని పూర్తి స్థాయిలో టీటీడీ ఆధ్వర్యంలోకి తీసుకుని నడపాలన్న ప్రతిపాదనను ధర్మకర్తల మండలి ఆమోదించింది.
  • కళ్యాణ కట్ట ఉద్యోగులను రెగ్యూలైజ్ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
  • ప్రధాని మోడీ పిలుపు మేరకు తిరుమలలో సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయబోతోంది టీటీడీ.
  • గత ప్రభుత్వం తిరుపతిలో చేపట్టిన గరుడ వారిధి రీ డిజైనింగ్ చేసి, రీ టెండర్ల ద్వారా టీటీడీనే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేతుల్లోంచి టీటీడీ తీసుకోవడానికి అనుమతి తీసుకుంటామన్నారు.