హనుమంతుడి జన్మస్థానం తిరుమల గిరుల్లోనే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ధారించింది. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానం అని టీటీడీ స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఈ నెల 13న ఉగాది రోజున అధికారికంగా ప్రకటించనుంది. హిందువుల ఆరాధ్యదైవం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల హనుమంతుని జన్మస్థానంగా గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు TTD సిద్ధమైంది.
అంజనీపుత్రుడి జన్మస్థానం ఆధారాల సేకరణకు గత 2020 డిసెంబరులో కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులు అనేక సార్లు సమావేశమై చర్చించారు. ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు కమిటీ ఐదు పురాణాలను, అనేక గ్రంథాలను పరిశీలించింది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలతో పుస్తకాన్ని ప్రింట్ చేయనున్నారు కమిటీ సభ్యులు.