తిరుమలలో యథేచ్ఛగా దళారీల దందా... శ్రీవారి సేవ టికెట్ల పేరుతో భక్తులకు టోకరా..

తిరుమలలో యథేచ్ఛగా దళారీల దందా... శ్రీవారి సేవ టికెట్ల పేరుతో భక్తులకు టోకరా..

కలియుగ వైకుంఠం తిరుమలలో మరోసారి దళారీల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవారి దర్శన టికెట్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని టీటీడీ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ దళారీల వలలో పడుతున్న భక్తుల సంఖ్య తగ్గడంలేదు. తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్ల కోసం దళారీల చేతిలో భక్తులు మోసపోయిన ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ అనే భక్తుడు భార్యతో కలసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం సేవా టికెట్లు కోసం ప్రయత్నించారు. అయితే శ్రీనివాస్ తనకు తెలిసినవారి ద్వారా తిరుపతికి చెందిన పోతిరెడ్డి, శేఖర్‌ అనే ఇద్దరు వ్యక్తుల్ని ఆశ్రయించారు. 

సేవా టికెట్ల కోసం రూ.43 వేలు డబ్బులు జమచేయమని చెప్పారు దళారులు. దీంతో వారికి డబ్బులు పంపించారు శ్రీనివాస్. ఇక శుక్రవారం (జూన్ 27న) దర్శనానికి రమ్మని చెప్పారు. దీంతో శ్రీనివాస్‌ నేరుగా తిరుపతికి వచ్చి వారికి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్ వెంటనే అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని ఆశగా వస్తే, ఇలా మోసం చేస్తారని అనుకోలేదని వాపోతున్నారు శ్రీనివాస్. దర్శనం, సేవా టికెట్లు, వసతి గదుల పేరుతో ఎవరైనా మాయ మాటలు చెబితే నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు టీటీడీ అధికారులు, పోలీసులు. శ్రీవారి దర్శనం టికెట్ల మధ్యవర్తులు అవసరం లేదని.. అధికారిక వెబ్ సైట్ లో, అప్లికేషన్ ద్వారా మాత్రమే టికెట్లు పొందాలని తెలిపారు టీటీడీ అధికారులు. టికెట్ల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు అధికారులు. దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు అధికారులు.