
నిర్మల్, వెలుగు: ఇంటర్మీడియట్రిజల్ట్స్ మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానం సాధించగా ఫస్ట్ ఇయర్ లో ఎనిమిదో స్థానం పొందింది. మొత్తం సెకండ్ ఇయర్ లో 5664 మంది పరీక్షలు రాయగా 3910 మంది పాస్ అయ్యారు. 69 శాతం మంది పాస్ అయినట్లు సంబంధిత ఆఫీసర్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ లో 5816 మంది పరీక్ష రాయగా 3650 మంది పాస్ అయ్యారు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో నిర్మల్ లోని రాంనగర్ కు చెందిన దేశెట్టి శ్రేష్ఠ 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించింది.
ఇంటర్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా వెనుకంజ
మంచిర్యాల, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థులు వెనుకబడ్డారు. రాష్ర్ట వ్యాప్తంగా ఫస్టియర్లో 57 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 18వ స్థానంలో నిలిచింది.
ఎంజేపీ స్టూడెంట్ స్టేట్ ఫస్ట్....
ఎంపీసీ ఫస్టియర్లో మందమర్రి జ్యోతిబాపూలె రెసిడెన్షియల్ కాలేజీ స్టూడెంట్ శ్రీరాముల హరిత 470 మార్కులకు 468 మార్కులతో స్టేట్ఫస్ట్ వచ్చింది. అదే కాలేజీకి చెందిన రాగం నవ్యశ్రీ 464, ఉప్పరి అశ్విత 464, లక్కం అశ్విని 463 మార్కులతో స్టేట్ ర్యాంకులు సాధించారు. సెకండియర్లో ఎంజేపీ గుడిపేట విద్యార్థి అయిడపు గణేష్ వెయ్యికి 989 మార్కులతో స్టేట్ 6వ ర్యాంక్, మందమర్రికి చెందిన మేకల సాత్విక 986 మార్కులతో 9వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. విద్యార్థులను, అధ్యాపకులను బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంగౌడ్, ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య బట్టు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ గోపీచంద్, మంచిర్యాల జిల్లా కో ఆర్డినేటర్ శేరు శ్రీధర్ అభినందించారు.
ఆదిలాబాద్ కు 10 వ స్థానం
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా 10వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో జిల్లా 9 స్థానంలో నిలవగా, ఈ సారి 10వ స్థానంలో నిలిచింది. సెకండియర్ లో గత ఏడాది 8వ స్థానంలో నిలవగా ఈ సారి 12వ స్థానానికి పడిపోయింది.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 8,927 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 5,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 61 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 8442 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 5,808 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
కోల్బెల్ట్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో మందమర్రి మోడల్ స్కూల్, సింగరేణి మహిళా కాలేజ్స్టూడెంట్లు ప్రతిభ కనబర్చారు. మోడల్ స్కూల్ నుంచి 112 మంది పరీక్షలు రాయగా 94 మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ జయ రామకృష్ణ తెలిపారు.
బెల్లంపల్లి , వెలుగు : ఇంటర్మీడియట్ ఫలితాల్లో బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీలో ప్రథమ సంవత్సరంలో గొల్ల బల రాముడు 464/470, బైపీసీ విభాగంలో సాయికిరణ్ 410/440 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సిలివేరు వినయ్ 969/1000 మార్కులు, బైపీసీ విభాగంలో మల్లెపూల సాయి 954 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సైదులు వివరించారు
కుమ్రంభీం ఆసిఫాబాద్ కు రాష్ట్రంలో ద్వితీయ స్థానం
ఆసిఫాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా 80.16 శాతం ఫలితాలతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మహాత్మా జ్యోతిబాపూలే కళాశాల విద్యార్థిని దీపిక బిశ్వాస్ 985/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచింది. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ విద్యార్థిని యశస్వి 976 మార్కులు, జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి పెందూరి రాజు 973, కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి పవన్ కళ్యాణ్ 969 మార్కులు సాధించి అత్యంత ప్రతిభ కనబరిచారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థుల్లో 4000 మంది పరీక్షలకు హాజరు కాగా 3249 మంది ఉత్తీర్ణులు కాగా 81 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ఫలితాల్లో 697 మందికి 544 మంది ఉత్తీర్ణత (78 శాతం మూడో స్థానం) సాధించారు. ప్రథమ సంవత్సరం జనరల్ ఫలితాల్లో 4371 మంది విద్యార్థులకు గాను 3227 మంది ఉత్తీర్ణత సాధించారు. (74శాతం ఉత్తీర్ణత తో మూడో స్థానం). ప్రథమ సంవత్సరం ఒకేషనల్ ఫలితాల్లో 766 మంది విద్యార్థులకు గాను 521 మంది ఉత్తీర్ణత సాధించారు (68 శాతం ఉత్తీర్ణతతో రెండవ స్థానం) సంపాదించారు.