
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త చైర్మన్గా సుదర్శన్ వేణు నియమితులయ్యారు. ఈ నియామకం ఈ ఏడాది ఆగస్టు 25 నుంచి అమలవుతుంది. ప్రస్తుత చైర్మన్ రాల్ఫ్ స్పెత్ స్థానంలో ఆయన నియమితులవుతారు. స్పెత్ రాబోయే ఏజీఎంలో కంపెనీ డైరెక్టర్గా తిరిగి నియమితులయ్యేందుకు ప్రయత్నించబోనని బోర్డుకు తెలియజేశారు. దీంతో 2025 ఆగస్టు 22న జరిగే ఏజీఎంలో ఆయన కంపెనీ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతారని టీవీఎస్ మోటార్ తెలిపింది.
2025 ఆగస్టు 23 నుంచి మూడు సంవత్సరాల కాలానికి స్పెత్ను కంపెనీ చీఫ్ మెంటార్గా నియమించనున్నట్లు బోర్డు ప్రకటించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా చైర్మన్గా రాల్ఫ్ అసాధారణ నాయకత్వం వల్ల కంపెనీకి ఎంతో మేలు జరిగిందని చెప్పారు.
ప్రపంచ మార్కెట్లలో మా వ్యూహాత్మక విస్తరణకు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మేనేజింగ్ డైరెక్టర్గా వ్యాపారానికి అపారమైన వృద్ధిని ప్రదర్శించిన సుదర్శన్, కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారని నమ్ముతున్నానని ఆయన అన్నారు.