రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్‌లాక్

రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్‌లాక్

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌ అన్‌లాక్ అయింది. వారం రోజుల క్రితం రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్, పలువురు నేతల ఖాతాలు టెంపరరీగా బ్లాక్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో తొమ్మిదేండ్ల బాలిక రేప్, మర్డర్ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ.. వారి ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. అయితే అత్యాచార బాధితుల ఐడెంటిటీని బయటపెట్టకూడదన్న రూల్‌కు ఇది విరుద్ధం కావడంతో ట్విట్టర్‌‌ రాహుల్‌ గాంధీ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్, పలువురు నేతల ట్విట్టర్ అకౌంట్లను కూడా బ్లాక్ చేసింది. రూల్స్ ఉల్లంఘన అంటూ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలను లాక్ చేయడంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎట్టకేలకు శనివారం వారందరి అకౌంట్లను మళ్లీ అన్‌లాక్ చేసింది ట్విట్టర్ సంస్థ. 

“కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అన్ని అకౌంట్లను ట్విట్టర్ అన్‌లాక్ చేసింది. అయితే ఇప్పుడు ఎందువల్ల మళ్లీ అన్‌లాక్ చేసిందో ట్విట్టర్ కారణం చెప్పలేదు” అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రోహాన్ గుప్తా తెలిపారు. పైగా తాము పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన్ ఏ ఒక్క ట్వీట్‌ను డిలీట్ చేయలేదని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ అన్‌లాక్ అయ్యాక తొలి పోస్ట్ ‘సత్యమేవ జయతే’ అని రాశారు.