ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్లోని కేఎస్ఎం ఫుడ్ ప్రొడక్ట్స్ పై హెచ్-ఫాస్ట్ బృందం, జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులు, టాస్క్ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు శనివారం సంయుక్తంగా దాడి చేశారు. 6 నెలలుగా కాలం చెల్లిన మైదా పిండి, బెల్లం, రసాయన ఫ్లేవర్లతో సోన్ పాపిడి, పల్లి పట్టీలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో రూ.4,07,300 విలువైన 1,560 సోన్ పాపిడి జార్లు, 240 పట్టీల జార్లు, ఎక్స్పైరీ అయిన ముడిపదార్థాలను, 670 కేజీల లేబుల్ లేని బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తక్కువ ధరకు ఈ పదార్థాలు కొనుగోలు చేసి కిరాణా షాపులకు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు మహమ్మద్ ఖలీద్, మేనేజర్ సంతోష్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముడిపదార్థాలను రాహుల్ తపాడియా సప్లై చేస్తున్నట్లు తేల్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్పేర్కొన్నారు.
