ఆడుకుంటూ కారులో ఇరుక్కొని ఇద్దరు పిల్లలు మృతి

ఆడుకుంటూ కారులో ఇరుక్కొని ఇద్దరు పిల్లలు మృతి

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం దారుణం జరిగింది. పిల్లలు కారులో ఆడుకుంటుండగా.. డోర్ లాక్ అవడంతో మృతిచెందిన ఘటన అక్కడివారిని కలిచివేసింది. నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలు ఇంటి ముందున్న కారులో ఆడుకుంటుండగా డోర్ లాకయింది. ఆ విషయాన్ని కారు యజమాని కూడా గమనించలేదు. కొంత సమయం తర్వాత పిల్లలు కనిపించకపోవడంతో ఇంటి సభ్యులంతా వెతికారు. కాసేపటికి పిల్లలు కారులో ఇరుక్కుపోయారని గుర్తించారు. వెంటనే తాళాలతో డోర్ ఓపెన్ చేసి చూడగా.. నలుగురు పిల్లలు అపస్మారకస్థితిలో ఉన్నారు. హుటాహుటిన వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఇద్దరు పిల్లలు మరణించారని ధృవీకరించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘నలుగురు పిల్లలు కారులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. పిల్లలంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ దారుణ ఘటన మంగళవారం ఉదయం 8 గంటలకు జరిగింది’ అని మొరాదాబాద్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు.