
నవాబుపేట, వెలుగు: సరదాగా ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు అగ్నిప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఇప్పటూరు గ్రామానికి చెందిన మంగళి మాధవులు, సువర్ణ దంపతుల చిన్న కొడుకు విఘ్నేశ్(9), తెలుగు రాములు, స్వాతి దంపతుల పెద్ద కొడుకు ప్రశాంత్(9) స్థానిక ప్రైమరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నారులు గురువారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని వరికల్లంలో ఉంచిన ట్రాక్టర్ కేజ్వీల్లోకి దిగి ఆడుకుంటున్నారు. పక్కనే ఉన్న వరిగడ్డిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి క్షణాల్లో కేజ్వీల్ కింద ఉన్న గడ్డి అంటుకుంది. చిన్నారులిద్దరూ ఏడుస్తూ కేజ్వీల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో వీల్ రంధ్రాల్లో ఇరుక్కున్నారు. గ్రామస్తులు తేరుకుని మంటలార్పి ఇద్దరు చిన్నారులను బయటకు తీసేలోపే శరీరమంతా కాలిన గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి చనిపోయారు. పోస్ట్మార్టం అనంతరం శుక్రవారం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్చెప్పారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం ప్రశాంత్ పుట్టినరోజు. బర్త్డేకు ఒక రోజు ముందు చిన్నారి మృతిచెందడం అందరినీ కలచివేసింది.