
కరోనా టీకా పంపిణీకి సంబంధించి ఇవాళ, రేపు జిల్లాస్థాయి వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు రాష్ట్ర వైద్య అధికారులు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, ఇతర ఉన్నతాధికారులు…. 33 జిల్లాల DMHOల పాటు ఇతర అధికారులు, డాక్టర్స్ కు వర్చువల్ గా శిక్షణ ఇస్తున్నారు. తరవాత మండలస్థాయి వైద్య సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వనున్నారు. రెండు రోజుల కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. తొలిరోజు శిక్షణలో వ్యాక్సినేషన్ ప్రణాళికలు, టీకా కోల్డ్ చైన్ నిల్వ, టీకా ఇవ్వాల్సిన విధానం, వ్యర్థాల నిర్వహణ, కొవిన్ సాఫ్ట్ వేర్ దాని పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. టీకా తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది? సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలపై రెండోరోజు వివరిస్తారు. పర్యవేక్షణ, టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భయాందోళనలు తొలగించడం, తగిన ప్రచారం కల్పించడం లాంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు అధికారులు.