రెండు ఇళ్లలో దొంగలు హల్ చల్.. భారీగా నగదు, బంగారం చోరీ

రెండు ఇళ్లలో దొంగలు హల్ చల్.. భారీగా నగదు, బంగారం చోరీ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలోని రెండు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం(డిసెంబర్ 17) సాయంత్రం చోరీకి పాల్పడ్డారు. జీనోమ్ వ్యాలీ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జహంగీర్ బాబు, కలమ్మ దంపతులు ఆదివారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి.. తాళం పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూడగా.. వస్తువులు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించారు. 

దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. రూ. 1.75 లక్షల నగదు, 9 తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెల్లినట్లు గుర్తించారు. పక్కనే ఉన్న మరో ఇంట్లో కూడా వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల దృశ్యాలు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.