
ఘట్కేసర్, వెలుగు: బర్త్డే పార్టీలో తప్పతాగిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు ఈత రాదంటున్నా తోటి ఉద్యోగిని స్విమ్మింగ్పూల్ లో బలవంతంగా తోసేశారు. గమనించిన మిగతా ఉద్యోగులు బాధితుడిని బయటకు తీయగా, అప్పటికే విగతజీవిగా మారాడు. ఘట్ కేసర్ సీఐ సైదులు వివరాల ప్రకారం.. మాదాపూర్లోని యష్ టెక్నాలజీ సంస్థ మేనేజర్ బర్త్డే వేడుకలను ఆదివారం అర్ధరాత్రి మేడ్చల్జిల్లా ఘట్ కేసర్ మండలంలోని ఘనపూర్లో వెంకటేశ్ చెందినఫాంహౌస్లో నిర్వహించారు.
ఈ వేడుకల్లో సంస్థకు చెందిన దాదాపు 20 మంది పాల్గొనగా, సాయికుమార్, రంజిత్ రెడ్డి ఫుల్గా మద్యం సేవించి తోటి ఉద్యోగి అజయ్ తేజ(24)కు ఈత రాదని తెలిసి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో బలవంతంగా తోసేశారు. గమనించిన మిగతా ఉద్యోగులు అజయ్ ను బయటకు తీసి జోడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అజయ్ మేనమామ కిషోర్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంజిత్ రెడ్డి, సాయికుమార్తో పాటు కంపెనీ మేనేజర్ శ్రీకాంత్, ఫాంహౌస్ యజమాని వెంకటేశ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.