
- ఏకే-47తో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం
- 24 గంటల్లో కీలక నేతలిద్దరు ఎన్కౌంటర్
- ఇంద్రావతి నేషనల్ పార్కు ఏరియాలో కొనసాగుతున్న కూంబింగ్
భద్రాచలం/ఆదిలాబాద్, వెలుగు:చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్కు ఏరియాలో వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు.
ఈయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. కాగా, నేషనల్ పార్కు ఏరియాలో అదనపు బలగాలు మోహరించాయి. భారీగా కూంబింగ్ కొనసాగుతున్నది. బీజాపూర్ పోలీసులు డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలతో నేషనల్ పార్కు ఏరియాను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ చోట మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో మైలారపు అడెల్లు భాస్కర్ మృతిచెందారు. ఘటనా స్థలంలో ఏకే-47 వెపన్తో పాటు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు కూడా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నారన్న అనుమానంతో నేషనల్ పార్కు ఏరియాను పోలీసులు చుట్టుముట్టారు. బండి ప్రకాశ్, పాపారావు కూడా భద్రతాబలగాల ఉచ్చులో చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు.
నక్సల్స్ ఆపరేషన్స్ ఏడీజీ వివేకానందసిన్హా, బస్తర్ ఐజీ సుందర్రాజ్ పి, సీఆర్పీఎఫ్ ఐజీ రాకేశ్ అగర్వాల్ బీజాపూర్లో మకాం వేసి కూంబింగ్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా ఉద్యమంలో..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ 1989– -91లో ఇంటర్ చదివే సమయంలో బోథ్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నక్సల్బరి వైపు ఆకర్షితులై 1994-95లో ఉద్యమంలో దళ సభ్యుడిగా చేరారు. భూపోరాటాల్లో కూడా పాల్గొన్నారు. అనతికాలంలోనే ఇంద్రవెల్లి దళం డిప్యూటీ కమాండర్ స్థాయికి చేరుకుని ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారు.
తర్వాత కేంద్ర కమిటీ ఆదేశాలతో దండకారణ్యానికి బదిలీ అయ్యారు. తల్లిదండ్రులు లేరు. ముగ్గురు సోదరులు వ్యవసాయ కూలీలుగా పొచ్చెర గ్రామంలో పనిచేస్తున్నారు. దళంలో కంతి లింగవ్వను ఆయన వివాహం చేసుకున్నారు. 2020లో తెలంగాణ రాష్ట్రంలో ఆయన తిరిగి ప్రవేశించి పార్టీ అప్పగించిన బాధ్యతల్లో భాగంగా రిక్రూట్మెంట్కు ప్రయత్నించారు.
అయితే, తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టడంతో ఆపరేషన్ భాస్కర్ పేరిట ఆదిలాబాద్ జిల్లాలో బలగాలు చుట్టుముట్టడంతో తిరిగి దండకారణ్యానికి వెళ్లిపోయారు. తెలంగాణ, చత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీలో కీలకనేతగా పనిచేశారు. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు కకావికలం అవుతున్నారు. గత నెలలో అబూజ్మడ్ ఏరియాలో ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు, తాజాగా 24 గంటల్లో ఇద్దరు కీలకనేతలైన తెంటు లక్ష్మీనర్సింహాచలం, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ చనిపోవడంతో ఆ పార్టీలో నైరాశ్యం నెలకొంది. దళాలు చిన్నాఛిన్నం అయ్యాయి. ఇంద్రావతి నేషనల్ పార్కు ఏరియాలో ఇంకా అగ్రనేతలు ఉన్నట్టుగా ఇంటిలిజెన్స్ వర్గాల పక్కా సమాచారంతో కూంబింగ్ కొనసాగుతోంది.
డీజీపీ స్థాయిలో ‘ఆపరేషన్ అడెల్లు’
2020 సెప్టెంబర్ నెలలో ‘ఆపరేషన్ అడెల్లు’ పేరుతో రాష్ట్ర పోలీసు శాఖ ఆసిఫాబాద్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టడం అప్పట్లో సంచలన కలిగించింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి డీజీపీ స్థాయి అధికారి మావోయిస్టు ప్రాబల్యమున్న మారుమూల ప్రాంతంలో ఐదు రోజుల పాటు మకాం వేశారు. ఆ సమయంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి నేతృత్వత్వంలో మావోయిస్టు కదలికలపై ఆరా తీశారు.
చత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి మావోయిస్టులు ప్రాణహిత మీదుగా జిల్లాలోకి రాకుండా కట్టడి చేయడంలో భాగంగా కూంబింగ్ నిర్వహించారు. ఆ ఆపరేషన్ అడెల్లు కోసమే జరిగినట్టు తెలిసింది. ఆసిఫాబాద్ ఇన్చార్జిగా ఉన్న మావోయిస్టు నేత అడెల్లు దళం సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతోనే డీజీపీ పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టారు.
అదే ఏడాది జులైలో తిర్యాణి మండలం మంగి, తొక్కిగూడ అడవుల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకోగా మైలారపు అడెల్లుతో పాటు ఆయన దళం తప్పించుకుంది. మళ్లీ ఐదేండ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అడెల్లు మృతి చెందారు. అడెల్లు మృతితో పొచ్చర గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.