రఘునాథపల్లి/ వికారాబాద్, వెలుగు: జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృతి చెందారు. వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్లోని గాంధీనగర్కు చెందిన వడ్లకొండ రాకేశ్ (28) హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన తండ్రి చనిపోవడంతో వరంగల్కు వెళ్లిన రాకేశ్.. ఓ పనిమీద మళ్లీ హైదరాబాద్ వెళ్లాడు. సోమవారం తండ్రి దశదినకర్మ ఉండడంతో తన సాఫ్ట్వేర్ ఫ్రెండ్ వడ్డేపల్లి సందీప్ (34)తో కలిసి బొలెరో కారులో హనుమకొండకు బయలుదేరాడు. ఈ క్రమంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్గేటు ఏరియాలో హైవేపై ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాకేశ్, సందీప్ స్పాట్లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో రెండు బైకులు ఢీ
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం మహమ్మదాన్ పల్లి గ్రామానికి చెందిన పగిడిగొమ్ముల మాణిక్యం (22), గుడిపల్లికి చెందిన అజయ్ స్నేహితులు. శుక్రవారం ఇద్దరూ మీట్ అయ్యారు. ఇద్దరూ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో బైకుపై వెళుతుండగా బంగారు మైసమ్మ ఏరియాలో మరో బైక్ ఎదురుగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాణిక్యం, ఎదురుగా వచ్చిన బైకర్ పాండు మృతి చెందినట్లు (36) పోలీసులు తెలిపారు.