
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 8–9 శాతం గ్రోత్ నమోదవుతుందని అంచనా
- వడ్డీ రేట్లు తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడం, సాధారణ వర్షపాతం వంటి అంశాలే కారణం
- ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న ఆదరణ
- వీటి సేల్స్ మరింత పెరిగే ఛాన్స్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టూవీలర్ల అమ్మకాలు 8–9 శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది కొవిడ్-కు ముందు లెవెల్స్ను దాటిపోతుందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ రిపోర్ట్ సోమవారం వెల్లడించింది. ద్రవ్యోల్బణం తగ్గడంతో ప్రజల కొనుగోళ్ల సామర్ధ్యం పెరుగుతుందని అంచనా. మరోవైపు సాధారణ వర్షపాతం ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఊపందుకుంటుందని, రూరల్ ఎకానమీ మెరుగవుతుందని రిపోర్ట్ వివరించింది. కేర్ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం, 2022–23 లో టూవీలర్ల అమ్మకాలు ఏడాది లెక్కన 8 శాతం వృద్ధి చెందాయి.
2023–24 లో 10 శాతం, 2024–25 లో 11 శాతం గ్రోత్ నమోదు చేశాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు పుంజుకోవడంతో సేల్స్ ఊపందుకున్నాయి. టూవీలర్ల ఎగుమతులు ఏడాది లెక్కన 21 శాతం పెరగగా, కేవలం డొమెస్టిక్ మార్కెట్లోని సేల్స్ 9 శాతం ఎగిశాయి. కీలక మార్కెట్లలో ద్రవ్యల్బణం, వడ్డీ రేట్లు.. రెండూ ఎక్కువగా ఉండడం, కరెన్సీ ఎక్స్చేంజ్ సమస్యలతో ఇండియన్ టూవీలర్ కంపెనీల ఎగుమతులు గతంలో పడిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ మార్కెట్లు స్టేబుల్గా ఉన్నాయని, ఇక్కడ డిమాండ్ రికవర్ అవుతోందని కేర్ఎడ్జ్ తెలిపింది. రూరల్ డిమాండ్ పెరగడం, అర్బన్ డిమాండ్ నిలకడగా ఉండడంతో ఇండియా డొమెస్టిక్ మార్కెట్లో సేల్స్ పెరిగాయని వివరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలా..
కిందటి ఆర్థిక సంవత్సరంలో టూవీలర్ల అమ్మకాలు మంచి గ్రోత్ను నమోదు చేశాయి. ఇదే ట్రెండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని కేర్ఎడ్జ్ అంచనా వేస్తోంది. బండ్ల సేల్స్ గ్రోత్ 8–-9 శాతం ఉండొచ్చని తెలిపింది. అంతేకాకుండా కొవిడ్ -ముందు లెవెల్స్ను దాటుతామని తెలిపింది. ఎక్స్పోర్ట్స్ 12–-14 శాతం పెరుగుతాయని, డొమెస్టిక్ సేల్స్ 6–-8 శాతం వృద్ధి చెందుతాయని అంచనావేసింది.
బలమైన ఎక్స్పోర్ట్ డిమాండ్, ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ వాడకం పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, రూరల్ సెంటిమెంట్ పుంజుకోవడం, సాధారణ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు, ప్రజల ఆదాయాలు మెరుగవడం వంటి కారణాలతో టూవీలర్ల సేల్స్ పెరగనున్నాయి. దీనికి తోడు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడతో వెహికల్ లోన్లపై వడ్డీ రేటు కూడా దిగొస్తోంది. తాజాగా ప్రకటించిన 50 బేసిస్ పాయింట్ల కోతతో కలుపుకుంటే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటును ఒక శాతం మేర ఆర్బీఐ తగ్గించింది. దీంతో వెహికల్ సేల్స్ ఊపందుకోనున్నాయి.
సమస్యలు లేకపోలేదు..
2024–25 లో టూవీలర్ల సేల్స్ గ్రోత్ ఎక్కువగా నమోదైంది. దీంతో హై బేస్ ఎఫెక్ట్ వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేటు ఎక్కువగా ఉండకపోవచ్చు. ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (ఓబీడీ) -–2 ఫేజ్ -బీ రూల్స్ తప్పనిసరి అయ్యాయి. దీంతో బండ్ల రేట్లు 1-2 శాతం వరకు పెరగొచ్చని కేర్ఎడ్జ్ రిపోర్ట్ పేర్కొంది. కానీ, మార్కెట్ స్ట్రాంగ్గా ఉందని, ఈవీల వాడకం పెరుగుతోందని ఈ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ ఆర్తి రాయ్ అన్నారు.
ఎగ్జిక్యూటివ్, ప్రీమియం సెగ్మెంట్ మోటర్సైకిళ్లు గ్రోత్కు సపోర్ట్ చేస్తాయని అంచనా వేశారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ అమ్మకాలు గత మూడేళ్ల నుంచి నిలకడగా పెరుగుతున్నాయి. 2022–23 లో 7.8 లక్షల యూనిట్లు (మొత్తం టూ-వీలర్ సేల్స్లో 4.38 శాతం వాటా) సేల్ అయ్యాయి. లో బేస్ వలన 180 శాతం గ్రోత్ నమోదైంది. 2023–24 లో ఎలక్ట్రిక్ టూవీలర్ల సేల్స్ ఏడాది లెక్కన 29 శాతం పెరగగా, 2024–25లో 19 శాతం వృద్ధి చెందాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లు అమ్ముడయ్యాయి.