
- మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో శైవ గ్రూప్, టారానిస్ కేపిటల్ సంయుక్తంగా అగ్రిమెంట్
- 5 స్థానిక కంపెనీలతో కుదిరిన ఎంవోయూ.. 5 వేల మందికి లభించనున్న ఉపాధి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూఏఈకి చెందిన శైవ గ్రూప్ భాగస్వామిగా మారింది. శైవ గ్రూప్, టారానిస్ కేపిటల్ సంయుక్తంగా రాష్ట్రంలో రూ.2,125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మంగళవారం సెక్రటేరియెట్లో శైవ గ్రూప్, టారానిస్ కేపిటల్ సంయుక్తంగా 5 స్థానిక కంపెనీలతో మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. బయోసైన్స్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని పేర్కొన్నారు. తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ కంపెనీల పెట్టుబడులతో కొత్తగా మరో 5,020 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పం అని తెలిపారు. ‘18 నెలల్లో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. ఫలితంగా ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయి. ఈ ప్రయాణంలో మరో గొప్ప అడుగు వేశాం’ అని పేర్కొన్నారు.
ఇది తొలి అడుగు మాత్రమే..
అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు దీటుగా దూసుకెళ్తున్న తెలంగాణ పురోగతిలో భాగస్వామయ్యేందుకు ముందుకొచ్చిన యూఏఈ కంపెనీలు శైవ గ్రూప్ , టారానిస్ కేపిటల్ ను ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నామని శ్రీధర్బాబు చెప్పారు. ‘శైవ గ్రూప్, టారానిస్ కేపిటల్ సంయుక్తంగా రివలేషన్స్ బయోటెక్ లో రూ.1,360 కోట్లు, మనాకిన్ బయోలో రూ.340 కోట్లు, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ లో రూ.80 కోట్లు, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ లో రూ.90 కోట్లు, యంత్ర టెక్ కంట్రోల్స్ లో రూ.255 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి’ అని వివరించారు. ‘ఇది తొలి అడుగు మాత్రమే. రాబోయే మూడేండ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్ టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగాల్లో మరో రూ.24 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శైవ గ్రూప్, టారానిస్ కేపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశాయి’ అని తెలిపారు. బయోటెక్ రంగం, ఫుడ్ మేనేజ్ మెంట్ ఉత్పత్తులు, పబ్లిక్ సెక్టార్ లో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టనున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి..‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాయ్ డిన్ రోచ్, శైవ గ్రూప్ చైర్మన్, సీఈవో అమిత్ జగన్నాథ్ వర్మ, టారానిస్ కేపిటల్ సీఈవో నికోలస్ ఎస్.బింగ్ హామ్, రివలేషన్స్ బయోటెక్ ఎండీ రవిచంద్ర బీరం, మనాకిన్ బయో డైరెక్టర్ జశ్వంత్ ప్రణవ్ యతిరాజాం, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ సీఈవో సంకర్ష్ చందా, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పాండు రంగారావు తమ్మినేని, యంత్ర టెక్ కంట్రోల్స్ సీఈవో సమీర్ కాంత్, తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడులపై తప్పుడు ప్రచారం..
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. వారికి తాము తీసుకొస్తున్న పెట్టుబుడులు, కల్పిస్తున్న ఉద్యోగాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అని కోరారు. ఇథనాల్ కంపెనీని బీఆర్ఎస్ నేతలు కావాలనే, రాజకీయ దురుద్దేశంతోనే అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కావాలని కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా కేసులు పెడతామని మంత్రి శ్రీధర్బాబు హెచ్చరించారు. రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలు పెంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.