
- గతంలో వేసిన అంచనాను పెంచిన యూబీఎస్
న్యూఢిల్లీ: స్విస్ బ్రోకరేజ్ కంపెనీ యూబీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 లో ఇండియా జీడీపీ 6.4 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ట్రేడ్ వార్ ఉన్నప్పటికీ ఆర్థికవ్యవస్థ స్ట్రాంగ్గా ఉందని తెలిపింది. గతంలో వేసిన అంచనా 6 శాతం నుంచి పెంచింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో భారత ఎకనామిక్ గ్రోత్ 7.4 శాతంగా ఉంది. దీంతో 2024–-25 లో జీడీపీ గ్రోత్ రేటు 6.5 శాతంగా నమోదైంది. 2023–24 లో నమోదైన 9.2 శాతంతో పోలిస్తే తగ్గింది.
యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం, లోకల్ డిమాండ్ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంది. చైనా ఇంపోర్ట్స్పై టారిఫ్స్ తగ్గే అవకాశం ఉండడం, యూఎస్–-ఇండియా ట్రేడ్ డీల్, క్రూడాయిల్ రేట్లు తగ్గడం వంటివి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అంశాలు. కుటుంబాలు చేసే వినియోగం పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం (వర్షాలు, తక్కువ ఫుడ్ ధరల వల్ల), అర్బన్ డిమాండ్ (ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, తక్కువ ఇన్ఫ్లేషన్, రేట్ కట్స్ వల్ల) పెరుగుతుందని అంచనా. గ్లోబల్గా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో ఇండియా గూడ్స్ ఎక్స్పోర్ట్స్ నెమ్మదిస్తాయి. కానీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మెరుగ్గా ఉంటాయని అంచనా.