కన్నుల పండువగా మల్లన్న రథోత్సవం.. శివ నామస్మరణతో మారుమ్రోగిన శ్రీశైల పురవీధులు

కన్నుల పండువగా మల్లన్న రథోత్సవం.. శివ నామస్మరణతో మారుమ్రోగిన శ్రీశైల పురవీధులు

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జన వాహిని మధ్య భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు శ్రీ గిరులు తరలి వచ్చారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివ నామస్మరణతో శ్రీశైల పురవీధులు మారుమ్రోగాయి. ఓంకార నాదంతో ఓం నమఃశివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో కన్నడ భక్తులు పులకించి పోయారు. ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లు రధోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మద్య రథోత్సవం కదలగానే వేలాదిమంది కన్నడ భక్తులు ఓం నమః శివాయ అంటూ నినాదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించి పోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు,అరటిపండ్లను రధంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు జరుపుకున్నారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతి  చెన్నసిద్దరామ శివచార్య స్వామి సహా భారీ సంఖ్యలో కన్నడ భక్తులు పాల్గొన్నారు.