జోర్దార్ గా బోనాలు .. ఇవాళ రంగం, అంబారీ ఊరేగింపు

జోర్దార్ గా బోనాలు .. ఇవాళ రంగం, అంబారీ ఊరేగింపు
  • లక్షల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • బోనాలు, తొట్టెలు చెల్లించి మొక్కులు
  • నేడు రంగం, అంబారీ ఊరేగింపు

హైదరాబాద్, వెలుగు :శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు, డోలు దరువులు.. డప్పుల చప్పుళ్లు నడుమ యువత కేరింతలు, డ్యాన్సులతో  సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. లష్కర్ వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయ పరిసరాలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జై... నినాదాలు మార్మోగాయి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహంకాళికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

సిటీ నుంచే కాకుండా జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షానికి క్యూలైన్లలోని భక్తులు తడవకుండా... టెంట్​వేశారు.  మెడికల్ హెల్ప్​, వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక వెహికల్ ద్వారా దర్శన సౌకర్యం కల్పించారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సేపు నిల్చోకుండా పోలీసులు, వలంటీర్లు చర్యలు చేపట్టారు.  సోమవారం ఉదయం రంగం జరగనుంది. స్వర్ణలత భవిష్యవాణి వినిపించనున్నారు. సాయంత్రం.. రూపావతి ఏనుగు అంబారీఊరేగింపు ఉండనుంది.