
- ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి తెరపడాలి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతియుత వాతావరణం కోసం పుతిన్, ట్రంప్ చర్చలను తాము స్వాగిస్తున్నామని.. యుద్ధానికి తెరపడాలని తాము ఆకాంక్షిస్తున్నామని ఇండియా పేర్కొంది. ‘‘అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ భేటీ కావడం ఆహ్వానించదగ్గ పరిణామం. శాంతి స్థాపనలో వారి ప్రయత్నం ప్రశంసనీయం” అని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అలాస్కా సమావేశం షెడ్యూల్ ప్రకటించినప్పుడు కూడా ఇండియా స్వాగతించింది. ఇప్పుడు మీటింగ్ తర్వాత కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుందని తాము బలంగా నమ్ముతున్నామని, ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా యుద్ధం కూడా చర్చల ద్వారా పరిష్కారమవుతుందనే విశ్వసిస్తున్నామని మన విదేశాంగ శాఖ తెలిపింది. ప్రపంచం మొత్తం ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నదని, ఆ దిశగా మొదలైన చర్చలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షించింది.