- శాటిలైట్ ఫొటోల ద్వారా కన్ఫర్మ్ చేసిన అమెరికా
- ఆరు కిలోమీటర్ల దూరంలో నదిపై బ్రిడ్జి కట్టినట్టు వెల్లడి
- భారీగా వెపన్స్, జవాన్లను తరలించిందని ఆరోపణ
మాస్కో: ఉక్రెయిన్ బార్డర్ల నుంచి బలగాలన్నింటినీ వాపస్ తీసుకొస్తున్నామని రష్యా చెబుతున్నా.. ఆ దాఖలాలేవీ కనిపించట్లేదు. పైగా వెస్టర్న్ రష్యా, క్రిమియా, బెలారస్లలో మరిన్ని బలగాలను మోహరిస్తున్నట్టు అమెరికా కంపెనీ మ్యాక్సార్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. తాజాగా 7 వేల మంది సైన్యాన్ని ఉక్రెయిన్సరిహద్దులకు రష్యా పంపిందని ఆ శాటిలైట్ ఫొటోల ద్వారా అమెరికా ఆరోపించింది. బెలారస్–ఉక్రెయిన్ సరిహద్దులకు జస్ట్ ఆరు కిలోమీటర్ల దూరంలోనే ప్రిప్యాత్ నదిపై ఓ బ్రిడ్జిని కట్టినట్టు తేల్చింది. అక్కడి బేస్లో సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ యూనిట్లతో ట్రైనింగ్ క్యాంపులనూ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ఫార్వర్డ్ లొకేషన్లలో గ్రౌండ్ ఎటాక్ హెలికాప్టర్లనూ మోహరించిందని, ఓ పెద్ద ఆసుపత్రిని కట్టించిందని వెల్లడించింది. క్రిమియా, వెస్టర్న్ రష్యాలో బలగాలు, భారీ ఆయుధాలను మోహరిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. నార్త్, నార్త్ఈస్ట్ ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే రష్యా భారీగా బలగాలను మోహరించిందని ఆ శాటిలైట్ ఫొటోల ద్వారా తేల్చింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ముప్పు ఇంకా తొలగిపోలేదని నార్త్అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మరోసారి హెచ్చరించింది. తమ భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలోనే స్పందిస్తామంటూ రష్యా చెప్పిందని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ గుర్తు చేశారు.
ఇండియన్లను ఇప్పుడే తీస్కురాం: కేంద్రం
ఉక్రెయిన్పై ఏ క్షణాన్నైనా రష్యా దాడికి దిగే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. అక్కడి ఇండియన్లను ఇప్పుడప్పుడే ఇండియాకు తరలించే ఆలోచన లేదని ఫారిన్ మినిస్ట్రీ ప్రకటించింది. ‘‘ఇప్పటికిప్పుడైతే ఇండియన్లను తరలించేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవు. స్పెషల్ ఫ్లైట్లనూ నడపడట్లేదు. అయితే, ప్రస్తుతమున్న ఎయిర్ బబుల్ అరెంజ్మెంట్స్, ఫ్లైట్ల సంఖ్య, ప్యాసింజర్లపై ఉన్న ఆంక్షలను మాత్రం ఎత్తేశాం. ఇండియా–ఉక్రెయిన్ మధ్య చార్టర్డ్ ఫ్లైట్లను నడిపేలా ఎయిర్లైన్స్సంస్థలకు అవకాశం కల్పిస్తున్నాం’’ అని ఫారిన్ మినిస్ట్రీ ఉన్నతాధికారి అరిందమ్ బాగ్చీ తెలిపారు.