గచ్చిబౌలి, వెలుగు : ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన ప్రకారం.. పంజాబ్లోని అమృత్సర్ చోగావాన్ ప్రాంతానికి చెందిన నేహ(19), తొమ్మిది నెలల కిందట సిటీకి వచ్చి గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్హాస్టల్లో ఉంటూ నానక్రాంగూడలోని గోల్ఫ్ఎడ్జ్లోని బారిష్టా బేకరీలో సేల్స్గర్ల్గా జాబ్ చేస్తున్నది. ఇదే బేకరీలో బాలాపూర్ పరిధి వెంకటాపురం ప్రాంతానికి చెందిన సల్మాన్ కూడా జాబ్ చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఇది సంస్థ యాజమాన్యానికి తెలియడంతో సల్మాన్ను జాబ్ నుంచి తొలగించారు.
ప్రేమికులు పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తన ప్రేమ విషయం సల్మాన్ ఇంట్లో చెప్పగా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో అతడు ఈనెల1న ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన నేహ.. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో హాస్టల్లోని తన ఫ్రెండ్స్ డ్యూటీకి వెళ్లాక రూమ్ లోపలి నుంచి లాక్ చేసుకొని ఫ్యాన్కు ఉరేసుకుంది. రూం క్లీన్ చేసేందుకు హాస్టల్ సిబ్బంది ఎంత సేపు డోర్ కొట్టినా తీయకపోవడంతో మరో లాక్ తో డోర్ ఓపెన్ చేసి చూడగా.. నేహ చనిపోయి కనిపించింది. వెంటనే హాస్టల్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. నేహ సోదరి మేఘా ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.