కీసర, వెలుగు: భార్య వేధింపులు తాళలేక ఓ డాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. కీసర సీఐ ఆర్కపల్లి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర పీఎస్ పరిధికి చెందిన డాక్టర్ జోసెఫ్ భార్య వీణపాణి మంగళవారం సాయంత్రం కీసర పోలీస్ స్టేషన్కు వచ్చి తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు జోసెఫ్ మొబైల్ను ట్రాక్ చేయగా, ఔటర్ రింగ్ రోడ్డుపై అతని కారు ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని కార్ డోర్ తెరిచే సరికి జోసెఫ్ అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. భార్య వేధింపుల కారణంగానే డాక్టర్ ఓ ఇంజక్షన్ వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. జోసెఫ్ తండ్రి ఆగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
