అనాకాడెమీ వ్యవస్థాపకులతో పాటు టీం లీడర్స్ జీతాల్లో 25శాతం కోత

 అనాకాడెమీ వ్యవస్థాపకులతో పాటు టీం లీడర్స్ జీతాల్లో 25శాతం కోత

ఆర్థిక మాంద్యం భయంతో ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలతో పాటు మరికొన్ని స్టార్టప్ లు సైతం తమ ఉద్యోగులను తగ్గించుకునే లేదా తీసివేసే పనిలో పడ్డాయి. అలాంటి వాటిల్లో ఎడ్ టెక్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్ట్ అప్ అన్ ఎకాడమీ ఒకటి. గత వారమే నాలుగో విడత ఉద్యోగుల కోత ప్రారంభించిన ఈ కంపెనీ.. దాదాపు 300 మంది స్టాఫ్ ను తీసివేసింది. తాజాగా వ్యవస్థాపకుల, టీం లీడర్ల జీతాల్లో సంవత్సరానికి 25శాతం కోతను విధించుకోనున్నట్టు కంపెనీ సీఈవో గౌరవ్ ముంజాల్ స్పష్టం చేశారు. దీని ప్రభావం కంపెనీ వ్యవస్థాపకులతో సహా అనాకాడెమీ నాయకత్వ సభ్యులపైనా పడనున్నట్టు ప్రకటించింది. ఇవి 25శాతం వరకు ఉండొచ్చని, అది వారి పని తీరుపైనా ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ కోతలు శాశ్వతమైనవన్న ఎడ్ టెక్.. ఏప్రిల్ 2024 లో వీటిని సవరిస్తామని చెప్పింది.

నాల్గవ రౌండ్ లేఆఫ్ లలో భాగంగా ఎడ్ టెక్ దాదాపు 380మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇది కంపెనీ మొత్తంలో 12శాతంగా తెలిపింది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఎడ్ టెక్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గత కొంత కాలంగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టిన ఈ కంపెనీ.. 2022లో 1000మంది శాశ్వత ఉద్యోగులను, నవంబర్ 350మందిని, జనవరిలో 40మంది స్టాఫ్ ను పీకేసింది.