పోలవరం విషయంలో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నాణ్యత పాటించకుండా, సరైన కార్యాచరణ కూడా లేకుండా వచ్చే ఏడాది కల్లా నీరిస్తున్నామంటున్న బాబు ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఉండవల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం విషయంలో నాణ్యత లేకపోతే ధన , ప్రాణ నష్టాలు జరుగుతాయని హెచ్చరించారు. నిర్వాసితుల పరిస్దితి ఏమిటో తెల్చకుండా నీరు ఎలా వదులుతారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగాయని, ఈవిఎంల ట్యాంపరింగ్ జరిగాయంటున్న బాబు.. తిరిగి 130 స్థానాలు మావేననటం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇండియా, పాకిస్తాన్ లా ఉన్నాయనడం సరికాదన్నారు. విభజన జరిగిన తీరుపై , విభజన సమయంలో వ్యవహరించిన దానిపై కొత్తగా ఎన్నికైన వారైనా.. మాట్లాడాలని కోరుకుంటున్నానని ఉండవల్లి అన్నారు.