బ్రియాన్ లారా, క్రిస్ గేల్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్.. అండర్–19 వరల్డ్కప్లో అదరగొట్టి ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్స్టార్లుగా ఎదిగిన క్రికెటర్లు..! వీళ్లు మాత్రమే కాదు.. శిఖర్ ధవన్, టిమ్ సౌథీ, ఐడెన్ మార్క్రమ్.. గత ఎడిషన్లో మెప్పించిన పృథ్వీ షా, శుభ్మన్ గిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది..! మెగా టోర్నీలో తలపడే ఇండియా టీమ్కు సెలెక్టవడంతో కొంత మంది కుర్రాళ్లు ఐపీఎల్లో కోటీశ్వరులైపోయారు..! పేరుకు కుర్రాళ్ల సమరమే అయినా క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అండర్-19 వరల్డ్కప్ మళ్లీ వచ్చేసింది..! మెగా టోర్నీ 13వ ఎడిషన్ సౌతాఫ్రికాలో శుక్రవారమే మొదలవనుంది..! 16 జట్లు పోటీపడుతున్న టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఐదో టైటిల్తో హై ఫైవ్ కొట్టాలని చూస్తోంది..!
కుర్రాళ్ల కప్పులో మొనగాళ్లెవరో!
ఐదో టైటిల్పై ఇండియా గురి
బరిలో 16 జట్లు
నేడు అఫ్గాన్తో సౌతాఫ్రికా ఢీ
కింబర్లే: టీనేజ్ క్రికెటర్ల అల్టిమేట్ వార్.. ఫ్యూచర్ సూపర్ స్టార్లను అందించే మెగా ఈవెంట్.. అండర్–19 వరల్డ్కప్కు తెరలేచింది. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే మెగా టోర్నీలో 16 జట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తొలి రోజు ఆతిథ్య సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ అండర్–19 జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్తో ‘కుర్రాళ్ల వరల్డ్ వార్’ మొదలవనుంది. ఈ నెల 19న శ్రీలంకతో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో నాలుగు గ్రూపుల్లో బరిలో ఉన్న 16 జట్ల మధ్య మొదట రౌండ్ రాబిన్ మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్లో ప్రతి టీమ్.. మిగతా ముగ్గురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది ప్రతి గ్రూప్లో టాప్–2 జట్లు క్వార్టర్ఫైనల్కు అర్హత సాధిస్తాయి. మిగతా టీమ్స్ క్లాసిఫికేషన్ మ్యాచ్లు ఆడుతాయి. గ్రూప్ దశలో ప్రతి విజయానికి రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ మ్యాచ్ టై అయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. నాకౌట్ దశలో టై అయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు.
కొత్తగా రెండు జట్లు
గత ఎడిషన్ టైమ్కు ఐసీసీ ఫుల్ మెంబర్లుగా ఉన్న 12 దేశాల్లో ఐర్లాండ్ మినహా మిగతా జట్లన్నీ ఈ టోర్నీకి నేరుగా క్వాలిఫై అయ్యాయి. క్వాలిఫికేషన్ మ్యాచ్ల ద్వారా కెనడా, స్కాట్లాండ్, యూఏఈ, నైజీరియా, జపాన్ మిగతా ఐదు బెర్తులు దక్కించుకున్నాయి. ఈ టోర్నీలో అరంగేట్రం చేయనున్న నైజీరియా, జపాన్.. వరల్డ్కప్లో ఏ లెవెల్లో అయినా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇండియానే ఫేవరెట్
డిఫెండింగ్ చాంపియన్ ఇండియానే ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్. ఇప్పటికే రికార్డు స్థాయిలో నాలుగు టైటిళ్లు గెలిచిన మన జట్టు ఐదోసారి విజేతగా నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ ప్రియమ్ గార్గ్ సహా టీమ్లో ఆరుగురు ప్లేయర్లకు ఇప్పటికే సీనియర్ క్రికెట్ (ఫస్ట్క్లాస్, లిస్ట్ ఎ లేదా టీ20) ఆడిన అనుభవం ఉంది. పైగా యశస్వి, గార్గ్, రవి బిష్నోయ్, కార్తీక్ త్యాగి ఐపీఎల్ కాంట్రాక్టులు కూడా దక్కించుకున్నారు. వీళ్లతో పాటు ధ్రువ్ జురెల్, స్పిన్నర్ అంకోలేకర్, హైదరాబాదీ తిలక్ వర్మతో మన జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది.19న లంకతో, 21న జపాన్తో, 24న న్యూజిలాండ్తో ఇండియా తలపడనుంది. టీమిండియా తర్వాత బంగ్లాదేశ్పై అందరి దృష్టి ఉంది. టోర్నీలో ఆడుతున్న అన్ని జట్ల కంటే గతేడాది హైయెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న బంగ్లాను అండర్డాగ్గా భావిస్తున్నారు. అఫ్గానిస్థాన్కు కూడా సంచలనం సృష్టించే సత్తా ఉంది. ఇండియా మాదిరిగా ఎక్స్పీరియన్స్, మంచి కోచింగ్ కలగలిసిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా బలమైన జట్లే.
ఏ గ్రూప్లో ఎవరు
గ్రూప్-ఎ: ఇండియా, శ్రీలంక, న్యూజిలాండ్, జపాన్.
గ్రూప్-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, నైజీరియా.
గ్రూప్-సి: పాకిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, స్కాట్లాండ్. గ్రూప్-డి: సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, కెనడా, యూఏఈ.