కరోనా పేరుతో వాయిదా వేసిన సింగరేణి యాజమాన్యం
నాలుగు నెలలుగా తప్పని ఎదురుచూపులు
ఆందోళనలో 26,694 మంది నిరుద్యోగులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి హాల్ టికెట్స్ పంపిణీ చేసిన సింగరేణి యాజమాన్యం నెలలు గడుస్తున్నా ఎగ్జామ్స్ పెట్టకపోవడంపై నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కంపెనీలో ఖాళీగా ఉన్న ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 128 ఫిట్టర్ పోస్టులకు 4,893, ఎలక్ట్రీషియన్ 51 పోస్టులకు 8,530, జూనియర్ స్టాఫ్ నర్సు 84 పోస్టులకు 13,271 చొప్పున మొత్తం 26,694 దరఖాస్తులు వచ్చాయి. మార్చి నెలలో ఎగ్జామ్ పెట్టేందుకు యాజమాన్యం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే హాల్ టికెట్లను క్యాండిడేట్స్డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్నెట్లో పెట్టింది. నోటిఫికేషన్ రావడంతోనే కోల్బెల్ట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోచింగ్సెంటర్లు వెలిశాయి. ఎలాగైనా జాబ్సాధించాలని నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో చేరారు. ఇంతలోనే ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. కొవిడ్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేర ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు యాజమాన్యం మార్చి నెలలో ప్రకటించింది. ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. స్టేట్ గవర్నమెంట్లాక్డౌన్ ప్రకటించిన టైంలో సింగరేణి మాత్రం లాక్డౌన్ ప్రకటించలేదు. మైన్స్ను యథావిధిగా నడిపింది. దీంతో ఎగ్జామ్స్ను యాజమాన్యం త్వరగానే నిర్వహిస్తుందని దరఖాస్తుదారులు అనుకున్నారు. మరోవైపు స్టేట్ గవర్నమెంట్ లాక్డౌన్ ఎత్తివేసి నెల దాటింది. ఎగ్జామ్ వాయిదా పడి నాలుగు నెలలు గడుస్తున్నా పరీక్షలపై సింగరేణి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైన్స్లలో గుంపులుగుంపులుగా వర్కర్స్ వెళ్తే రాని కరోనా ఎగ్జామ్ పెడితేనే వస్తుందా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఎగ్జామ్డేట్ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.