
రాష్ట్రంలో అధికార పార్టీల దందా జరుగుతోందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ అన్నారు. టీఎస్పీ ఎస్సీ అవకతవకలపై నిరుద్యోగ జేఏసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. అవినీతికి పాల్పడితే శిక్ష పడాల్సిందేనని చెప్పారు. చట్టాలంటే భయం లేకుండా పోతుందన్నారు.
టీఎస్పీఎస్సీ అవకతవకలపై విచారణ జరగాలని కాంగ్రెస్ నేత రియాజ్ అన్నారు. నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా రాశారని ప్రశ్నించారు. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. పేపర్ లీక్ పై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
గత కొన్ని రోజులుగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కమిషన్ లో పని చేసే ఉద్యోగులే ఈ లీకేజీ వ్యవహారంలో కీలక నిందితులు కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంతో లక్షలాది మంది నిరుద్యోగుల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్ ఘటన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు ప్రవీణ్ తో పాటు మరో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.