యునెస్కో గుర్తింపు దక్కేనా?

యునెస్కో గుర్తింపు దక్కేనా?

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగుప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయం బురదమయమైయింది. ఎంతో గొప్పవైన శిల్పాలు మురికినీటిలో మునిగిపోతున్నాయి. అబ్బుర పరిచే శిల్పాలను పట్టించుకున్న నాథుడే లేడు.. యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతున్న రామప్ప పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి.రాష్ట్రంలో పలు ఆలయాలకు వందల కోట్ల రూపాయలు ఇస్తున్న సీఎం కేసీఆర్‌‌ రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి మాత్రం నిధులివ్వడం లేదు. దీంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. మరో 12 రోజుల్లో ఫ్రాన్స్‌‌లోని యునెస్కో హెడ్‌‌ ఆఫీస్‌‌ నుంచి ప్రతినిధులు రామప్పకు రాబోతున్నారు.  గుడితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. బురదమయమైన, మురికి నీటితో నిండిన పరిసరాలను చూసి వారు ఎలా రియాక్ట్‌‌‌‌ అవుతారోనని చరిత్ర అధ్యయనకారులు వాపోతున్నారు. యునెస్కో ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో  గురువారం ‘వెలుగు’ జిల్లా ప్రతినిధి గుడి, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ఘనమైన చరిత్ర

కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని హయాంలో ఆయన సేనాని రేచర్ల రుద్రయ్య రామప్ప ఆలయాన్ని నిర్మించారు. 1173లో మొదలైన పనులు నలభై ఏళ్ల పాటు సాగి 1213లో పూర్తయ్యాయి. కర్ణాటకకు చెందిన రామప్ప అనే శిల్పి దీన్ని నిర్మించారు. ప్రధాన గుడితో పాటు అనుబంధంగా కామేశ్వర, కాటేశ్వర, త్రికూట, త్రిపురాలయం వంటి 20 అనుబంధ ఆలయాలు నిర్మించారు. ఇక్కడి అద్భుతమైన శిల్పాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. నీటిపై తేలియాడే ఇటుకలతో గుడి నిర్మాణం జరిగింది. కాకతీయుల సామ్రాజ్యం పతనం తర్వాత 1323లో ఈ ఆలయం మూతపడింది. తరువాత ఆరు వందల ఏళ్లకు నిజాం ప్రభుత్వ హయాంలో 1911లో గుడిని బాగు చేశారు. అప్పటి నుంచి గుడి మళ్లీ తెరుచుకున్నట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది.

గోపురాలకు పాకురు

గుడి శిఖరం పూర్తిగా పాకురు పట్టి నల్లగా కన్పిస్తోంది. శిల్పాల సౌందర్యం కన్పించడం లేదు. యునెస్కో ప్రతినిథుల రాక నేపథ్యంలో ఈ నల్లటి పాకురును తొలగిస్తే బాగుండేదని పర్యాటకులు కోరుతున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు మాత్రం అలాంటి పనులేమీ చేయబోవడం లేదన్నారు. గతంలో రామప్ప గుడి చుట్టూరా బోర్డులు ఉండేవి. ఆలయ చరిత్ర, శిల్పాల గురించి వివరించేలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌‌‌‌ భాషల్లో ఉండేవి. ఇటీవల వీటిని తొలగించారు.

గుడి పరిసరాలు  ఇలా

యునెస్కో ప్రతినిథుల రాక నేపథ్యంలో నీట్‌‌‌‌గా కనిపించాల్సిన గుడిలో ఎక్కడ చూసినా బురదే కన్పిస్తోంది. తూర్పు ద్వారం వైపు సుమారు 3, 4 ఎకరాల మేరకు బురదనీరు నిలిచింది.  దోమలు..ఈగలతో దుర్వాసన వస్తోంది. అద్భుతమైన శిల్పాలు ఆ నీటిలో పడి ఉన్నాయి. 2012లో కూలి పోయిన తూర్పు ముఖద్వారం (ప్రాకారం) అలాగే ఉంది. 2017 ఆగస్టులో వానలకు పడిపోయిన ప్రహరీ నిర్మాణం కోసం తవ్విన పునాదుల్లో నిండా నీళ్లున్నాయి. యునెస్కో వారు వచ్చే సమయానికి ఈ పనులేవి పూర్తయ్యే పరిస్థితి కనిపంచడం లేదు. ఈ గోడ కూలినప్పుడే రాష్ట్ర హైకోర్టు సుమటోగా కేసు నమోదు చేసి వెంటనే ప్రహరీ నిర్మాణం చేయాలని, రామప్ప ఆలయం, అనుబంధ ఆలయాలను పునరుద్దరించాలని ఆదేశించింది. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది.

  •    కాటేశ్వర, కామేశ్వర, త్రికూట ఆలయాలు, సరస్సు వద్ద కట్టపై ఉన్న శివాలయం శిథిలమైపోయాయి.
  •    కామేశ్వరాలయం పునరుద్ధరిస్తామంటూ 2013లో విప్పి కుప్ప పెట్టారు. ఎంతో అద్భుతమైన శిల్పాలు బురదనీటిలో ఉండిపోయాయి.
  •    త్రికూట ఆలయం పూర్తిగా మట్టిలోనే పూడుకుపోయింది.

యునెస్కో గుర్తింపు వస్తే లాభమేంటీ?

యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. యునెస్కో గుర్తింపు పొందిన స్థలాల అభివృద్ధి కోసం నిధులు కూడా వస్తాయి. ఇండియా నుంచి 1983లో అజంతా, ఎల్లోరా, ఆగ్రా ఫోర్ట్‌‌‌‌, తాజ్‌‌‌‌మహల్‌‌‌‌లకు తొలిసారిగా యునెస్కో గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38 ప్రదేశాలకు ఈ గుర్తింపు లభించింది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌ నుంచి ఒక్క ప్లేస్‌‌‌‌ కూడా లేదు. 2018లో జైపూర్‌‌‌‌, రామప్ప,  ఉండవల్లి ప్రదేశాలు పోటీ పడగా జైపూర్‌‌‌‌కు స్థానం దక్కింది. ఈ ఏడాది మరోసారి రామప్ప పోటీలో నిలిచింది.