
కామెడీ హీరోగా ఒకప్పుడు కడుపుబ్బ నవ్వించిన రాజేంద్ర ప్రసాద్.. సెకెండ్ ఇన్నింగ్స్లో ఆ నలుగురు, ఇట్లు మీ శ్రేయోభిలాషి వంటి ఎమోషనల్ చిత్రాలతోనూ ఆకట్టుకుంటున్నారు. ఆ కోవలోనే ‘అనుకోని ప్రయాణం’ అనే మరో సీరియస్ కాన్సెప్ట్ మూవీ చేశారు. వెంకటేష్ పెదిరెడ్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ సమర్పణలో డా. జగన్ మోహన్ నిర్మించారు. ఈ నెల 28న మూవీ విడుదల కానుండటంతో ఇటీవల ట్రైలర్ను లాంచ్ చేశారు. బతుకుదెరువు కోసం రాజమండ్రి నుంచి భువనేశ్వర్ వెళ్లిన ఇద్దరు స్నేహితుల కథ ఇది.
రాజేంద్రప్రసాద్, నరసింహరాజు బెస్ట్ ఫ్రెండ్స్. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇద్దరూ పని చేస్తుంటారు. హఠాత్తుగా రాజు మరణిస్తాడు. అతని శవాన్ని కుటుంబం దగ్గరికి చేర్చాలనుకుంటాడు ఆర్పీ. అయితే లాక్డౌన్ టైమ్ కావడంతో వీలుపడదు. దాంతో స్నేహితుడి మృతదేహాన్ని భుజాల మీద వేసుకుని నడుచుకుంటూ రాజమండ్రి బయల్దేరతాడు. ఈ అనుకోని ప్రయాణంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేది మిగతా కథ. పొట్ట చేతపట్టుకుని రాష్ట్రాలు దాటివెళ్లే కార్మికుల కష్టాలతో పాటు, లాక్డౌన్ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని కూడా హార్ట్ టచింగ్గా చూపించారని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఎమోషనల్ సీన్స్లో రాజేంద్రప్రసాద్ మరోసారి గుండె పిండేయడం ఖాయమనిపిస్తోంది.