నల్గొండ జిల్లాలో పూర్తికాని యువ వికాసం ఎంపిక .. ప్రొసీడింగ్స్​ పెండింగ్​

నల్గొండ జిల్లాలో పూర్తికాని యువ వికాసం ఎంపిక .. ప్రొసీడింగ్స్​ పెండింగ్​
  • పూర్తికాని యువ వికాసం ఎంపిక .. ప్రొసీడింగ్స్​ పెండింగ్​ ఫ్రీ విత్తనాలు, 
  • సైకిళ్ల పంపిణీతో సరి
  • ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా తర్వాతే
  • నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

యాదాద్రి/నల్గొండ, వెలుగు : అర్హుల ఎంపిక పూర్తి కాకపోవడంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున స్కీమ్స్​కు సంబంధించిన ఎలాంటి ప్రొసీడింగ్స్​ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులకు అందించడం లేదు. యాదాద్రి జిల్లాకు ఈసారి కూడా ముఖ్యఅతిథిగా వస్తున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి జాతీయ జెండా ఎగురవేస్తారు. అనంతరం కేవలం ఫ్రీ విత్తనాలకు సంబంధించిన కిట్స్ రైతులకు, టెన్త్ లో​మంచి మార్కులు సాధించిన స్టూడెంట్స్​ సైకిళ్లు అందించనున్నారు. 

ఇంకా ఎంపిక కాలే..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్​యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజీవ్​యువ వికాసం స్కీమ్ కోసం యాదాద్రి జిల్లాలో 39,141 అప్లికేషన్లు, సూర్యాపేట జిల్లాలో 60 వేల అప్లికేషన్లు, నల్గొండ జిల్లాలో 31,092 అప్లికేషన్లు వచ్చాయి. రూ.50 వేల నుంచి రూ.లక్షలోపు యూనిట్లకు టార్గెట్ కంటే తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. రూ.2 లక్షల లోపు నుంచి రూ.4 లక్షల్లోపు యూనిట్లకు ఎక్కువ మంది అప్లికేషన్లు చేసుకున్నారు. 

అయితే యాదాద్రి జిల్లాకు 7041 యూనిట్లు, సూర్యాపేట జిల్లాకు 16,738 యూనిట్లు, నల్గొండ జిల్లాకు 20 వేల యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. బ్యాంకర్ల నుంచి లిస్ట్ వచ్చినా అప్లికేంట్లు ఎక్కువ మంది ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రొసీడింగ్స్ కాపీలు ఇవ్వడం లేదు.  

ఇందిరమ్మ ఇండ్ల కోసం..

ఇందిరమ్మ ఇండ్ల కోసం యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. సర్వే పూర్తయిన అనంతరం 2024-–25 ఫైనాన్షియల్​ ఇయర్​కు సంబంధించి మొదటగా 762 మందికి, ఆ తర్వాత 8,191 మందికి ఇండ్లు మంజూరు చేశారు. 4,900 మంది ఇండ్ల ముగ్గులు పోసినా 260 మంది బేస్మెంట్​లెవల్, 36 మంది రూఫ్ లెవల్, మరో 8 మంది స్లాబ్ వేశారు. సూర్యాపేట జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నాలుగు నియోజకవర్గాలకు 14 వేల ఇండ్లు మంజూరు చేయగా, వీటిలో 12,868 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. వీటిలో మొదటి ఫేస్ లో 4,322 ఇండ్లు, సెకండ్ ఫేజ్ లో 8,546 ఇండ్లు నిర్మించానున్నారు. 

1,046 మంది ఇండ్లకు ముగ్గులు పోయగా, 579 మంది బేస్మెంట్​లెవల్, 117 మంది రూఫ్ లెవల్, మరో 10 మంది శ్లాబ్ వేశారు. నల్గొండ జిల్లాలో 4,27, 542 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోగా, ఫేజ్ –1లో 1906, ఫేజ్ –2లో 19,698 ఇండ్లు మంజూరు చేశారు. వీటిలో 610 మంది ముగ్గు పోయగా, 261 మంది బేస్మెంట్ లెవల్, 16 మంది రూఫ్ లెవల్ పూర్తి చేశారు. వీటిలో రెండు ఇండ్లు మాత్రమే పూర్తి చేశారు. కొత్తగా మంజూరైన వారికి ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పారు. కానీ తాము ఎక్కడికక్కడే ఇస్తామని ఎమ్మెల్యేలు చెప్పడంతో అది పక్కన పెట్టేశారు.  

రేషన్ కార్డులు ఫ్రింట్అయినా..

తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇప్పుడే ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, మెంబర్స్​యాడింగ్​కోసం మీ సేవలో అప్లయ్​ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా 24,806 కార్డుదారులు మెంబర్​యాడింగ్​కోసం అప్లయ్ చేసుకోగా, 38,277 మందిని యాడ్​చేశారు. 2298 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయడంతోపాటు 7,220 మంది మెంబర్లను యాడ్​చేశారు. నల్గొండ  జిల్లాలో 96 వేల మంది అప్లై చేసుకోగా, కొత్తగా 8,750 కార్డులు మంజూరు చేశారు. 

దీంతో కొత్తగా 61,247 మంది లబ్ధిదారులు పెరిగారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 15,106 మంది అప్లై చేసుకున్నారు. వీటిలో  కొత్తగా 1,238 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా, 11,752  మంది కుటుంబ సభ్యుల పేర్లను కార్డులో చేర్చారు. అయితే ప్రింటింగ్ పూర్తయిన కొత్త రేషన్ కార్డులు 2,298 మందికి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినా వాటిని కూడా ఎక్కడికక్కడ ఇవ్వడంపైనే ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారు. 

విత్తనాల కిట్స్, సైకిళ్ల పంపిణీ..

రైతులకు నాణ్యమైన విత్తనాలు ఫ్రీగా పంపిణీ చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నిర్ణయం తీసుకుంది. గ్రామానికి ముగ్గురు రైతుల చొప్పున యాదాద్రి జిల్లాలో 1,263 మంది, సూర్యాపేట జిల్లాలో 837 మంది, నల్గొండ జిల్లాలో 1692 మందిని ఎంపిక చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేతుల మీదిగా రైతులకు విత్తనాల కిట్స్ అందించనున్నారు. అదే విధంగా టెన్త్​లో మంచి మార్కులు సాధించిన స్టూడెంట్స్​కు సైకిళ్లు ఇస్తానని కలెక్టర్ హనుమంతరావు గతంలో ప్రకటించారు.ఈ వేడుకల్లో స్టూడెంట్స్​కు సైకిళ్లు అందించనున్నారు.