సీఎం మమతా టైమ్ క్లోజ్.. 2026లో బెంగాల్‎లో బీజేపీ‎దే పవర్: అమిత్ షా

సీఎం మమతా టైమ్ క్లోజ్.. 2026లో బెంగాల్‎లో బీజేపీ‎దే పవర్: అమిత్ షా

బెంగాల్: పశ్చిమ బెంగాల్‎లో సీఎం మమతా బెనర్జీ సమయం ముగిసిందని.. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (జూన్ 1) బెంగాల్ లో పర్యటించిన అమిత్ షా.. నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సంవత్సరాలుగా బెంగాల్ కమ్యూనిస్ట్ పాలనలో ఉంది.. ఆ తర్వాత  మా, మాతి, మానుష్ నినాదంతో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారని అన్నారు. 

కానీ మమతా బెనర్జీ నాయకత్వంలో బెంగాల్‎లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, నేర కార్యకలాపాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మమతా బెనర్జీ సీఎం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు చేశారు. దీదీ పాలనతో బెంగాల్ ప్రజలు విసుగు చెందారని.. ఆక ఆమె సమయం ముగిసిందని.. 2026 బెంగాల్ ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని జోస్యం చెప్పారు. 

బెంగాల్‎లో చొరబాట్ల, అవినీతి, హిందువుల వలసలను ఆపడానికి బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి దీదీ ఆపరేషన్ సిందూర్,  వక్ఫ్ సవరణ చట్టం రెండింటినీ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎ను వ్యతిరేకించడం ద్వారా ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులను ఆమె అగౌరవపరిచారని ఫైర్ అయ్యారు. 

ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకించిన మమతా బెనర్జీకి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, జాతీయ భద్రతతో కూడా ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. మమతా బెనర్జీ బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను తెరిచారని.. ఆమె చొరబాట్లను అనుమతిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీదీ అక్రమ చొరబాట్లను ఆపలేరని.. బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని అన్నారు. సరిహద్దులో కంచె కోసం భూమి అడిగినా.. ఆమె ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలోకి చొరబాట్లు కొనసాగుతూనే ఉంటాయి.. దీదీ ఓటు బ్యాంకు పెరుగుతూనే ఉంటుందని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ తన తర్వాత ఆమె మేనల్లుడిని సీఎం చేయాలని చూస్తోంది.. కానీ అది జరగనివ్వమని అన్నారు. 

ALSO READ | దేశాన్ని తప్పుదోవ పట్టించారు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌లో ముర్షిదాబాద్‌లో చెలరేగిన మత అల్లర్ల వెనక టీఎంసీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. అల్లర్లను అదుపు చేయడానికి బీఎస్ఎఫ్‎ను మోహరించడానికి కేంద్ర హోంశాఖ బెంగాల్ ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరినా.. ఆమె  అనుమతించలేదని దీంతో అశాంతి నెలకొందని అన్నారు. అధికారం కోసం సీఎం మమతా బెనర్జీ అన్ని పరిమితులను దాటారని విమర్శలు గుప్పించారు.