సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ కు అమిత్ షా

సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ కు  అమిత్ షా

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ  వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. సెప్టెంబర్‌ 16న  అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు బీజేపీ లోకల్ లీడర్లతో సమావేశం అవుతారు. సాయంత్రం దివంగత సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి  కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్‌ షా పరామర్శించనున్నారని సమాచారం. హీరో ప్రభాస్‌ తో అమిత్ షా  ప్రత్యేకంగా భేటీ కానున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల మునుగోడు సభకు హాజరైన అమిత్ షా... జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.  

బీజేపీ ఏర్పాట్లు 

హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వజ్రోత్సవ వేడుకలను నిర్వహించేందుకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్‌ 17న ఉదయం 8గంటలకు జాతీయ జెండాను అమిత్ షా ఆవిష్కరించనున్నారు. విమోచన వజ్రోత్సవ వేడుకలకు జరిపేందుకు బీజేపీ భారీ ఎత్తున జనసమీకరణ చేస్తోంది. అదే రోజున తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి కేసీఆర్ ప్రసంగించనున్నారు.