
హైదరాబాద్, వెలుగు: ప్రతి టీచర్ యోగాకు అంబాసిడర్ కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.ఈ నెల 20న ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అటెంట్ కానున్నారని వెల్లడించారు. సోమవారం నగరంలోని సీజీఓ టవర్స్ లో యోగా డే ప్రిపరేటరీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ...వన్ డే ముందు కౌంట్ డౌన్ కింద ఎల్బీ స్టేడియంలో ముందు రోజే యోగా డే ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
వైజాగ్ లో నిర్వహించే యోగాడేలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని చెప్పారు. మనిషి మానసికంగా, శారీరకంగా.. ఉత్సాహంగా ఉండాలంటే యోగా దినచర్య కావాలని సూచించారు. అన్ని రంగాల్లో సులువైన పద్ధతులు అవలంబించడంతో అనేక శారీరక మానసిక రుగ్మతలకు గురవుతూ, అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. హాస్పిటల్స్ నయం చేయలేని రోగాలను సైతం యోగా ద్వారా తగ్గించుకోవచ్చని స్పష్టం చేశారు.
వయస్సుతో సంబంధం లేకుండా యోగా చేయడం అలవార్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో టీచర్ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా..కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పడి 11 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 11,12 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లను ప్రారంభించనున్నారు.