- రోజ్గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్,వెలుగు: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు యూనివర్సిటీలు, నవోదయ, పీఎం శ్రీ స్కూళ్లను కేంద్రం పెంచుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కింగ్ కోటిలోని భారతీయ విద్యా భవన్లో జరిగిన 17వ 'రోజ్గార్ మేళా'లో అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. యువతను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను మాతృభాషలో అందించేలా ఎన్ఈపీలో మార్పులు చేశామని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని చేరుకోవడంలో యువశక్తి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని.. 2027 నాటికి 3వ స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు కోటి 25 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ అందించామన్నారు. 2014లో 350 ఉన్న స్టార్టప్లు.. 2024 నాటికి 1.5 లక్షలకు పెరిగాయని.. వీటి ద్వారా 17 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని వివరించారు. డిజిటల్ ట్రాన్సాక్షన్లలో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా డిజిటల్ లావాదేవీలు మనదేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో మరో 51 వేల మందికి నియామక పత్రాలు అందజేశామని.. ఇందులో హైదరాబాద్ నుంచి 11 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 80 మందికి లెటర్లు అందాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.
