- ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రభుత్వం
- అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటా.. తొలి ప్రకటనలోనే హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అయతుల్లా మొజ్తబా ఖమేనీ(56) ఎన్నికయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కొడుకు మొజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్గా అధికారికంగా ఎన్నుకున్నామని ఇరాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తండ్రి మరణం తర్వాత దేశాన్ని నడిపించే బాధ్యత మొజ్తబా తీసుకున్నారని, ఇరాన్ శక్తివంతమైన పారామిలిటరీ దళం రెవల్యూషనరీ గార్డ్స్ కూడా కొత్త సుప్రీం లీడర్కు విధేయతతో ఉంటుందని స్పష్టం చేసింది. బాధ్యతలు చేపట్టిన కొద్ది నిమిషాల్లోనే మొజ్తబా అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కాగా, 56 ఏండ్ల మొజ్తబా తన తండ్రిలాగే రెవల్యూషనరీ గార్డ్స్తో బలమైన సంబంధాలు కలిగినవాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు అయతుల్లా రుహొల్లా ఖమేనీ, ఆపై అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్లుగా పనిచేశారు. ప్రస్తుతం మూడో సుప్రీం లీడర్గా మొజ్తబా ఎన్నికయ్యారు. మొదటి సుప్రీం ఇరాన్ను పదేండ్లు పాలించగా, అలీ ఖమేనీ 37 ఏండ్లపాటు పాలించారు.
డెత్ టు మొజ్తబా అంటూ ప్రజల నిరసన
మొజ్తబా సుప్రీం లీడర్గా ఎన్నికైన కొద్ది గంటల్లోనే టెహ్రాన్లో ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు. వాళ్లవాళ్ల ఇండ్ల బాల్కనీళ్లో నిల్చుని డెత్ టు మొజ్తబా(మొజ్తబాకు మరణం) అంటూ స్లోగన్స్ చేశారు. డిక్టేటర్షిప్ వారసత్వాన్ని ఒప్పుకోం అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలు మొజ్తబా ఎన్నికను వ్యతిరేకిస్తున్నారు. రాజరికాన్ని కూలగొట్టి 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్గా అవతరించిన ఇరాన్లో సుప్రీం లీడర్ ఎంపిక అనేది వంశపారంపర్యంగా కాకుండా, నాయకత్వ సమర్థత ఆధారంగా ఉండాలనే భావజాలం ప్రజల్లో నాటుకుపోయింది. ఈ కారణంగా.. ప్రస్తుతం ఒక సుప్రీం లీడర్ మరణం తర్వాత ఆయన కొడుక్కే అధికారాన్ని బదిలీ చేయడంతో ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎన్నికలను ఇస్లామిక్ రిపబ్లిక్ డిక్టేటర్గా చూస్తున్నారు. దేశంలో ఏండ్లుగా ఆర్థిక సంక్షోభాలు, మానవహక్కుల ఉల్లంఘనలుండగా, యుద్ధం కారణంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు పుతిన్ అభినందనలు
టెహ్రాన్/మాస్కో: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ముజ్తబా ఖమేనీ ఇరాన్ మూడో సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పుతిన్ స్పందిస్తూ మీ తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ కష్టకాలంలో ఇరాన్ ప్రజలను ఐక్యం చేస్తారని తను నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో టెహ్రాన్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రష్యా ఎప్పటికీ ఇరాన్కు నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందన్నారు.
