
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వాలని తాను ఎన్నిసార్లు లెటర్లు రాసినా కేసీఆర్ సర్కారు నుంచి స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్కు ఆయన రాసిన లేఖలను మంత్రి షేర్ చేశారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్కు సంబంధించి కేంద్రం తన వాటాకు అదనంగా రెండు రెట్లు కలిపి రూ.789.28 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కోటాలో రూ.760 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.129 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. మిగిలిన ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతోనే ఎంఎంటీఎస్ రెండో ఫేస్ పనులు స్టార్ట్ కాలేదని చెప్పారు.