
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు భారత్ నిర్వహించిన జీ- 20 సమిట్ 21వ శతాబ్దిలోనే అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన సమావేశాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీ20 సమిట్ ముగింపు సందర్భంగా ఆదివారం కిషన్ రెడ్డి ఆఫీసు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే ప్రభావవంతమైన నాయకులందరూ ఒకేతాటిపైకి వచ్చి.. భవిష్యత్తు కోసం కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.
నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పరస్పర సమన్వయంతో పనిచేసేందుకు ఆమోదం తెలపడం.. ఈ సమావేశాల వేదిక ద్వారా అంతర్జాతీయ సహకార స్ఫూర్తిని చాటిచెప్పిందన్నారు. జీ-20 లో ఆఫ్రికన్ యూనియన్కు స్థానం దక్కడం భారతదేశ అంకితభావాన్ని తెలియజేస్తున్నదని ఆయన అన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే మార్గంగా ‘సంస్కృతి’కి ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ సరైన గుర్తింపును కల్పించిందని తెలిపారు.