ప్రజలు సహకరిస్తే వేగంగా ఫ్లై ఓవర్ల నిర్మాణం 

ప్రజలు సహకరిస్తే వేగంగా ఫ్లై ఓవర్ల నిర్మాణం 
  • అంబర్ పేట, గోల్నాకలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • రోడ్ల విస్తరణ,  ఫ్లై ఓవర్ల నిర్మాణంపై స్థానికులతో మాట్లాడిన కేంద్ర మంత్రి 
  • స్మశానవాటికలు, ప్రార్థనా మందిరాల వల్లే పనుల ఆలస్యం -కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రజలు సహకరిస్తే ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతాయని, స్మశాన వాటికలు, ప్రార్థనా మందిరాలు ఉండడం వల్ల రోడ్డు విస్తరణ కొలిక్కి రాక మరింత ఆలస్యం అవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గురువారం అంబర్ పేట, గోల్నాక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ,  ఫ్లై ఓవర్ల నిర్మాణాలను పరిశీలించిన ఆయన స్థానికులతో మాట్లాడారు. స్మశాన వాటికలు, ప్రార్థనా మందిరాలు ఉండడం వల్లే రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు ఆలస్యం అవుతున్నాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అంబర్ పేట్ లో అనేక సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్య ఉందని, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. అయితే స్మశాన వాటికలు ఉన్నందున రోడ్ విస్తరణ అనుకున్న స్థాయిలో జరగడంలేదన్నారు. ట్రాఫిక్ సమస్యకు ఫ్లై ఓవర్ల నిర్మాణం ఒక్కటే పరిష్కారమని భావించి ఫ్లై ఓవర్ల నిర్మాణంచేపట్టామన్నారు. ప్రధాని మోడీ, నితిన్ గడ్కరీ సహకారంతో ఫ్లై ఓవర్ పనులు ముందుకు వెళ్లాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2018లో శంకుస్థాపన చేయించినా.. నిధుల కొరత కారణంగా ఆలస్యం అయిందని, భూ సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, జీహెచ్ఎంసీలో నిధుల కొరతతో ఆలస్యమైందన్నారు. పైపులైన్, 11 కేవీ కేబుల్ షిప్టింగ్ ఛార్జీలను కేంద్రమే భరిస్తుందని ఆయన తెలిపారు. కొన్ని శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రజల సహకారం కావాలని, శాశ్వత పరిష్కారం కోసమే ఈ పనిచేస్తున్నామని ఆయన వివరించారు. ప్రార్థనా మందిరాలు, స్మశాన వాటికల నిర్వాహకులు పెద్దమనసుతో ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. నిర్మాణం జరిగేటప్పుడు ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాల్సి వుందని, దీనివల్ల ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పవు, అందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఆలస్యం చేయకుండా అధికారులు వారానికి ఒకసారి సమన్వయ సమావేశాలు నిర్వహించుకొని పనులను పర్యవేక్షించుకోవాలని, ఒకటి రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో హై లెవల్ మీటింగ్ ఏర్పాటుచేసి పనులను వేగవంతం చేస్తానని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. భూసేకరణ పనులు ఆలస్యం అవడంతోనే పనులు వేగంగా జరగలేదని, సాధ్యమైనంత త్వరగా భూసేకరణ చేసి కాంట్రాక్టర్ కు అందిస్తే పనులు వేగం అందుకుంటాయన్నారు. రూ.500 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, సిగల్ కేఫ్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు 100 అడుగుల రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. ప్రార్థన మందిరాల తొలగింపు పై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని, యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేయించామని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి నిధులు కేటాయించాలన్నారు. 17వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేసి సర్వే కూడా పూర్తి అయిందని,  భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశామన్నారు. భూసేకరణకు కేంద్రం తనవంతు సహాయం అందిస్తుందని,రీజనల్ రింగ్ రోడ్డు వస్తే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.