- ఎంపీ చామల ప్రశ్నకు కేంద్ర మంత్రి రక్ష నిఖిల్ సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: క్రీడలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఇందుకు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే స్పష్టం చేశారు. అయితే, ఖేలో ఇండియా వంటి స్కీమ్ల కింద అర్హతల మేరకు రాష్ట్రాలు పంపే ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. ఈ మేరకు సోమవారం లోక్సభలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ అవర్లో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కేంద్రానికి పంపిన ప్రతిపాదనలపై ప్రశ్నించారు.
ఈ ప్రతిపాదనల్లో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం అప్గ్రేడేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో షూటింగ్ రేంజ్ ఏర్పాటు, రాష్ట్రంలో స్పోర్ట్స్ హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనకు కేంద్ర ఆర్థిక సహాయం కోరినట్టు సభ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు కేంద్ర మంత్రి బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పరిశీలించి, నిధులు మంజూరు చేస్తామని సమాధానం ఇచ్చారు.
